మేం సిద్ధంగా ఉన్నాం: మోడీ వ్యాఖ్యలపై ధీటుగా పాక్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల పైన పాకిస్తాన్ ధీటుగా స్పందించింది. మోడీ వ్యాఖ్యలను బుధవారం పాక్ తిప్పికొట్టింది. తమతో పోరాడే దమ్ములేక పాకిస్తాన్ తీవ్రవాదులను ఉసిగొల్పుతోందన్న మోడీ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, అవి నిరాధారమని పేర్కొంది.
సరిహద్దుల్లో ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనేందుకు తమ సేనలు సిద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్లేమ్ గేమ్ ఆడే బదులు పాకిస్తాన్, భారత్ల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపాలని సూచించారు. కాగా, మంగళవారం మోడీ పాకిస్తాన్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
ఢిల్లీపై నిఘా
భారతదేశ 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా ఢిల్లీ పోలీసులను, పారా మిలిటరీ దళాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఉగ్రవాద ముప్పు సహా, అన్ని రకాల ఉపద్రవాలను నిరోధించే రీతిలో భద్రతా వలయాన్ని ఢిల్లీ చుట్టూ ఏర్పాటుచేస్తున్నారు.
అనేక ఉగ్రవాద సంస్థల నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని ఈసారి భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా, పకడ్బందీగా ముమ్మర ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. గతంలో కంటే ఈ ఏర్పాట్ల తీవ్రత, విస్తృతి ఈసారి మరింతగా పెరిగింది. వైమానిక నిఘాతో పాటు దశలవారీగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రధాన ఉత్సవాలు జరిగే ఎర్రకోట వద్ద అనూహ్యమైన రీతిలోనే భద్రత పదునెక్కుతోంది. హెలికాప్టర్ల పెట్రోలింగ్తో పాటు వైమానిక రక్షణను కూడా వేడుకల కేంద్రానికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గం పొడవునా భారీఎత్తున దళాలను మోహరిస్తున్నారు. అలాగే రాజ్ఘాట్ వద్ద కూడా ఇదే స్థాయి భద్రత కనిపిస్తోంది.
శుక్రవారం నుంచి రెడ్ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో అనుమతి పొందిన వాహనాలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఎక్కడా ఏ లోపం లేని విధంగా భద్రతా వ్యవస్థను రూపొందించారు. ప్రజలు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. బుధవారంనుంచి పూర్తిస్థాయిలో రిహార్సల్స్ జరుగుతాయి.
ఢిల్లీ మెట్రో, ఐజిఐ విమానాశ్రయం, మార్కెట్ స్థలాలు, రైల్వే స్టేషన్లు, ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్స్, ఇతర కీలక ప్రాధాన్యత కలిగిన అన్ని ప్రాంతాల్లోనూ అదనంగా సిబ్బందిని నియమించారు. నగరంలోనూ, ఢిల్లీ సరిహద్దుల్లో కూడా వాహనాల తనిఖీ విస్తృతంగా కొనసాగుతోంది. ఇందుకోసం ఐదువేలమందిని నియోగిస్తున్నారు.
ప్రధాన వేదిక వద్ద పదివేలమంది ప్రజలను అనుమతించే ఏర్పాట్లు చేయడం వల్ల భద్రతా దళాలకు తనిఖీ బాధ్యత మరింతగా పెరిగింది. 17వ శతాబ్దం నాటి ఎర్రకోట సమీపంలోని అన్ని ఆకాశహర్మ్యాల పైన కూడా ఎన్ఎస్జి దళాలను, ఇతర నిపుణులను నియమిస్తున్నారు. రాఫ్, స్వాట్, వజ్ర దళాలకు చెందిన జవాన్లు ఎర్రకోట వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.