చీ పాకిస్థాన్: భారత్ డీటీహెచ్ ప్రసారాలకు చెక్
ఇస్లామాబాద్: విదేశీ చానెళ్ల ప్రసారాలపై పాకిస్థాన్ ప్రభుత్వం త్వరలో ఆంక్షలు అమల్లోకి తీసుకురానుంది. పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరి అథారిటీ (పీఈఎమ్ఆర్ఏ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మరి కొద్ది నెలల్లో పాకిస్థాన్ డీటీహెచ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అందు వలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని పీఈఎమ్ఆర్ఏ తెలిపింది. శాటిలైట్ చానెళ్లకు, ఆపరేటర్లకు తగిన సమయం ఇస్తున్నామని, అంత లోపు విదేశీ చానెళ్ల ప్రసారాలు నిలిపివేయాలని సూచించింది.
విదేశీ చానెళ్ల ప్రసారాలు నిలిపివేయని వారిపై అక్టోబర్ 15 తరువాత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత్ కు చెందిన డీటీహెచ్ ప్రసారాలపై ఇప్పటి నుంచే నిషేధం విధిస్తున్నామని పీఈఎమ్ఆర్ఏ చైర్మన్ అబ్సర్ అలం చెప్పారు.
పాకిస్థాన్ లో భారత చానెళ్ల ప్రసారం చెయ్యడానికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎఫ్ బీఆర్, ఎఫ్ఐఏ, స్టేట్ బ్యాంకు ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు పీఈఎమ్ఆర్ఏ వివరించింది. ప్రతి రోజు 2 గంటల 40 నిమిషాలు మాత్రమే విదేశీ ప్రసారాలను పాకిస్థాన్ లో ప్రసారం చేస్తామని తెలిపింది.