పంచాయతీ ఆర్డర్: మహిళపై నలుగురు రేప్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణ సంఘటన జరిగింది. పంచాయతీ ఆదేశాల మేరకు నలుగురు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. వారి కుటుంబాలను అవమానించిందనే ఆరోపణపై పంచాయతీ ఆ మహిళకు ఆ శిక్ష విధించింది.
ఆ సంఘటన పాకిస్తాన్ ముజఫర్గడ్ జిల్లా పిటాఫీ గ్రామంలో చోటు చేసుకుంది. బచల్ మాయి (47) భర్త తమ్ముడు బిలాల్ ఓ బాలికతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దాంతో పంచాయతీ ముందుకు ఆ విషయం వచ్చింది.
దాంతో మహిళపై సామూహిక అత్యాచారం చేయాల్సిందిగా పంచాయతీ ఆ కుటుంబాలకు చెందినవారికి సూచించింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బిలాల్ను, ఆయన సోదురడిని, బచల్ మాయిని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి నూర్ ముహమ్మద్ ఫిర్యాదు మేరకు వారిని కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు.
బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపుల కోసమని జనవరి 28వ తేదీన పంచాయతీ పెద్దలు గులామ్ ముస్తఫా, హఫీజ్ అతుల్ల కేహలాంద్, అబ్దుల్ ఖాలీక్ తమను పిలిచారని బచల్ మాయి చెప్పింది. దాంతో బచల్ మాయి, ఆమె అత్త అన్వర్ మాయి, కుటుంబంలోని మగాళ్లు నూర్ ముహమ్మద్ ఇంటికి వెళ్లామని బచల్ మాయి చెప్పింది.
మహిళలిద్దరిని ఇంట్లోకి అనుమతించి, మగాళ్లను వద్దని చెప్పారని, మహిళలు ఇంట్లోకి వెళ్లగానే ఏడుగురు వ్యక్తులు దాడి చేశారని అంటున్నారు. నూర్ మొహ్మమద్, మొహ్మద్ హుస్సేన్, రియాజ్ అహ్మద్, ఫియాజ్ బచల్ మాయిని వేరే గదిలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశారని చెబుతున్నారు
దాడి చేసినవారు తన వక్షోజాలను కొరికారని, తాను గొడవ చేయడంతో తమ మగాళ్లు తలుపులు బద్దలు కొట్టి గదిలోంచి తనను తీసుకుని వచ్చారని ఆమె చెప్పాడు. ఈ వ్యవహారమంతా జరుగుతుండగానే పంచాయతీ పెద్దలు అక్కడి నుంచి జారుకున్నారు.