పాకిస్థాన్: హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేశారు
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ నగరంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు తుపాకులతో వచ్చి అపవిత్రం చేశారు. ఈ ఘటన స్థానిక హిందువుల్లో భయాందోళనలు కలిగించిందని పాకిస్థాన్లోని ప్రముఖ మీడియా సంస్థ డాన్ మంగళవారం పేర్కొంది.
డాన్ కథనం ప్రకారం.. జనవరి 21న ఈ ఘటన చోటుచేసుకొంది. పొడవైన గడ్డం కలిగి, సల్వార్ కమీజ్లు ధరించిన ముగ్గురు వ్యక్తులు తుపాకులను గాల్లో ఊపుతూ 60 ఏళ్ల క్రితంనాటి దేవాలయంలో చొరబడ్డారు. ఆయుధాలతో బెదిరించి పూజలు చేస్తున్న భక్తులను బయటకి పంపించారు.
ఆ తర్వాత గర్భగుడిలో కొలువైన శీతలమాత, సంతోషి మాత, భవానీ మాత విగ్రహాలను అపవిత్రం చేశారు. ఈ ఘటనతో ఆలయంలో పూజలు చేసేందుకు రావడానికి భక్తులు భయపడుతున్నట్లు ఆలయ ధర్మకర్త సాక్షిమహారాజ్ తెలిపినట్లు డాన్ పేర్కొంది.

తన తాత 60 ఏళ్ల క్రితం భారత్ నుంచి పాకిస్థాన్ వచ్చి స్థిరపడి ఈ ఆలయం నిర్మించారని సాక్షిమహారాజ్ తెలిపారు. పిల్లలు లేకపోవడంతో 14 ఏళ్ల మోహన్ అనే బాలుడిని ఆయన పెంచుకున్నారు. చంపాబాయి అనే మహిళతో వివాహం జరిపించారు. వారి కుమారుడిని తానే అని మహారాజ్ తెలిపారు.
పిల్లలు లేని ఎంతో మంది హిందూ భక్తులు మాతృత్వం పొందాలని ఈ దేవాలయంలో పూజలు చేస్తారని చెప్పారు. ‘దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఓ అద్భుతం జరిగింది. భక్తులు పూజలు చేస్తున్న సమయంలో కాళీమాత పాదాల అచ్చులు విగ్రహం వద్ద ఉంచిన కుంకుమ పొడిలో ప్రత్యక్షమయ్యాయి' అని సాక్షి మహారాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications