మా వరకు విభజన (దేశ) పూర్తి కాలేదు: పాక్లో హిందువుల పరిస్థితి ఇదీ
పాకిస్తాన్లోని హిందువులు తాము అనుభవించిన కష్టాలు చెబితే ఎవరి కంటనైనా కన్నీరు రావాల్సిందే. ఎలాంటి రాతి గుండె అయినా ఆ హృదయం ద్రవించాల్సిందే.
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని హిందువులు తాము అనుభవించిన కష్టాలు చెబితే ఎవరి కంటనైనా కన్నీరు రావాల్సిందే. ఎలాంటి రాతి గుండె అయినా ఆ హృదయం ద్రవించాల్సిందే.
దేశ విభజన జరిగి డెబ్బై ఏళ్లవుతోంది. ప్రజాస్వామ్య దేశాల్లో అందరూ సమానమే. మతం ఏదైనా ప్రభుత్వం దృష్టిలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి.
కానీ పాకిస్తాన్లోని హిందువుల గురించి వింటే హృదయం ద్రవిస్తుంది. పాకిస్తాన్లో అతిపెద్ద మైనార్టీ హిందూ మతం. మిగతా మైనార్టీ మతాలు అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉంటాయి.
పాక్లో హిందూ జనాభా దాదాపు 1.6 శాతం ఉంటుంది. పాక్లోని హిందువులు తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. చాలామంది అపహరణకు గురవుతున్నారు. అత్యాచారాలు, బలవంతపు పెళ్లిళ్లకు గురవుతున్నారు.
ఇరుగుపొరుగు ముస్లీంలో స్నేహంగా ఉంటూనే
జోధ్పూర్లోని శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న హిందువులు పాకిస్థాన్లో తాము అనుభవించిన కష్టాలను చెప్తుంటే వినేవారి హృదయాలు ద్రవిస్తాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం.. ఇరుగు పొరుగున ఉండే ముస్లింలు స్నేహంగా ఉంటూనే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
బలవంతంగా..
హిందూ మహిళలపై అత్యాచారాలు, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకోవడం వంటి దురాగతాలకు పాల్పడుతుంటారు. హిందూ పురుషులను హత్య చేస్తూ ఉంటారు. హిందువుల ఆస్తులను బలవంతంగా లాక్కుంటారు.
పాక్లో ఒక్క రోజు కూడా ప్రశాంతంగా జీవించలేదు
పాక్లోని జనాభాలో 1.6 శాతం మంది హిందువులు ఉన్నారు. కానీ వీరిపై ముస్లింలు యథేచ్ఛగా దాడులకు, దారుణాలకు పాల్పడుతున్నారు. తమపై వివక్ష కొనసాగుతోందని అందుకే భారత్ రావాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ నుంచి వచ్చి, జోద్పూర్లో ఉంటున్న హిందువులు చెబుతున్నారు. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా జరుగుతున్నాయని, తాము కనీసం ఒక్క రోజు అయినా పాకిస్థాన్లో ప్రశాంతంగా జీవించలేదంటున్నారు. తమ వరకు ఇంకా విభజన (దేశ విభజన) ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. పాక్లోని హిందువులు భారత్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
సరిహద్దుల్లో నిఘా
మరోవైపు, పాకిస్థాన్లోని మత హింస నుంచి తప్పించుకోవడానికి భారతదేశానికి వస్తున్న వారికి సరిహద్దుల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేలాదిమంది హిందువులు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఏదైనా పని చేసుకోవడానికి వీరికి చట్టబద్ధమైన హక్కులు లేవు. రాళ్ళ క్వారీల్లో శ్రమిస్తున్నారు. వీరిపై నిఘా సంస్థల అధికారులు గట్టి నిఘా పెడుతున్నారు.
నిబంధనలు సరళతరం చేసిన మోడీ ప్రభుత్వం
మోడీ ప్రభుత్వం భారత్కు వస్తున్న హిందువులకు ఆశ్రయం కల్పించేందుకు నిబంధనలను సరళతరం చేసింది. వలస వచ్చిన వారు పౌరసత్వం కోసం తాము ఉన్న రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కేంద్రానికి దరఖాస్తు చేయవలసిన అవసరం లేకుండా నిబంధనలను మార్చింది. ఏడు సంవత్సరాలపాటు భారతదేశంలో ఉన్న పాకిస్థానీ హిందువులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే, ఫాస్ట్ ట్రాక్లో పౌరసత్వం పొందేందుకు అర్హులవుతారు. కానీ అధికార వర్గాలు చేసే జాప్యం వల్ల ఈ ప్రక్రియ చాలా ఆలస్యమవుతోంది.