అమెరికాలో కుప్పకూలిన విమానం.. ఆరుగురు మృతి !
అమెరికాలోని ఒహాయోలో దారుణ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం యంగ్స్టౌన్-వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సెస్నా 441 మోడల్కు చెందిన ఒక చిన్న విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ విషాదకర ఘటనలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయంలోనే అవాంతరం ఏర్పడి భూమికి పడిపోయింది. విమాన ప్రమాద స్థలానికి సమాచారం అందిన వెంటనే స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు ధ్రువీకరించారు.

వెస్టర్న్ రిజర్వ్ పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంతోనీ ట్రెవెనా మాట్లాడుతూ, మృతదేహాలను ట్రంబుల్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి తరలించామని, వారి గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం మృతుల పేర్లను అధికారికంగా వెల్లడించలేదు.
హౌలాండ్ టౌన్షిప్ అగ్నిమాపక విభాగం చీఫ్ రేమండ్ పేస్ మాట్లాడుతూ, విమానం కూలిన ప్రాంతం విపత్కర భౌగోళిక పరిస్థితుల మధ్య ఉన్నదని, అక్కడికి చేరుకోవడమే సవాలుగా మారిందని వివరించారు. సహాయక చర్యలు చేపట్టిన బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం టెక్నికల్ లోపం వల్ల కూలిపోయిందా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో పరిశీలన జరుగుతోంది. మొత్తం ఘటనపై FAA మరియు NTSB (National Transportation Safety Board) సంయుక్తంగా విచారణ చేపట్టాయి. ఈ ప్రమాదం అమెరికాలో మరోసారి చిన్న విమానాల భద్రత పై చర్చకు దారితీస్తోంది. బాధితుల కుటుంబాలకు అధికారులు సానుభూతిని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications