ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ జోడీ మనదే
ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 అంతర్జాతీయ సదస్సు ప్రపంచ దేశాల మధ్య అనేక కీలక రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలకు వేదికైంది. జీ7 సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీ, కెనడా, యూకే, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో పాల్గొంటోన్నాయి. ఫ్రాన్స్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఎవియాన్ లెస్ బైన్స్ దీనికి వేదిక.
ప్రధాన దౌత్యపరమైన చర్చల కంటే కూడా దీనికి సైడ్ లైట్స్ హైలైట్ అవుతున్నాయి. మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఎదురుపడ్డ సందర్భం హాట్ టాపిక్ అయింది. మోదీ- మెలోనీ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సదస్సుకు హాజరైన దేశాల నేతలంతా గ్రూపు ఫోటో కోసం ఒకచోటికి చేరుకుంటోన్న సమయంలో మోదీ, మెలోనీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడే ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ప్రధాని మోదీని చూడగానే జార్జియా మెలోని చిరునవ్వుతో ఎదురొచ్చారు. ఆత్మీయంగా పలకరించారు. అతి తక్కువ రోజుల్లోనే ప్రధాని మోదీని కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఆనందంగా ఉందని మోదీతో అన్నారు. ఆ వెంటనే కాస్త సరదాగా నవ్వుతూ.. "ఇన్స్టాగ్రామ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంట బహుశా మనమేనేమో.. " అంటూ ఆమె చమత్కరించారు. దీనికి మోదీ బిగ్గరగా నవ్వడం కనిపించింది. అవును అన్నట్లు తల ఊపారాయన.
కిందటి నెలలోనే ప్రధాని మోదీ ఇటలీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెలోడీ చాకెట్ల పాకెట్ ను బహూకరించారు. మెలోనీకి మెలోడీ చాకెట్ పాకెట్లను బహుమతిగా ఇవ్వడానికి సంబంధించిన వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. మీమ్స్ సైతం తెగ వైరల్ అయ్యాయి. దీని తర్వాత ఇంటర్నెట్ ప్రపంచంలో మెలోడీ ఓ బ్రాండ్గా మారిపోయింది. విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.
ఆరు గంటల వ్యవధిలోనే 10 కోట్లకు పైగా వీక్షణలను సాధించి సరికొత్త రికార్డు సృష్టించిందా వీడియో. ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలలో కోటి ముప్పై లక్షలకు పైగా లైక్లతో దూసుకుపోతోంది. ఈ స్థాయిలో ప్రజాదరణ పొందడం ద్వారా నిజంగానే ఇన్స్టాగ్రామ్లో అత్యంత ఫేమస్ జంట తామేనని మరోసారి నిరూపించుకున్నట్లయింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించారు మెలోనీ.
అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఉండే దౌత్యపరమైన బంధాలతో పాటు, నేతల మధ్య ఉండే ఇలాంటి స్నేహపూర్వక క్షణాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి. సాంప్రదాయ ప్రోటోకాల్స్ కంటే భిన్నంగా ఉండే ఇలాంటి స్నేహ సంబంధాలు ప్రపంచ ప్రజలకు దౌత్యాన్ని మరింత దగ్గర చేస్తాయనే వాదనలు లేకపోలేదు. జీ7 సదస్సులో చోటు చేసుకున్న ఈ తాజా పరిణామం కూడా భారత- ఇటలీ మధ్య ఉన్న బలమైన స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications