భారత్కు రండి: పోప్ ఫ్రాన్సిస్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ, అరగంటపాటు చర్చ
వాటికన్ సిటీ: ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వాటికన్ సిటీలో క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ను కలిశారు. ఆయన వెంట కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. దాదాపు 30 నిమిషాలపాటు వీరు సమావేశమయ్యారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కరోనా మహమ్మారి వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. రోమన్ క్యాథలిక్ హెడ్ పోప్ను ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకోవడం ఇదే తొలిసారి. కాగా, పోప్ ఫ్రాన్సిస్తో దిగిన ఫొటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పోప్ ఫ్రాన్సిస్ను భారత్ కు ఆహ్వానించినట్లు వెల్లడించారు.
కాగా, వాటికన్ సిటీలో రోమన్ క్యాథలిక్ మత పెద్దను కలిసిన ఐదో భారత ప్రధాని నరేంద్ర మోడీ కావడం గమనార్హం. ఇంతకుముందు మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, ఐకే గుజ్రాల్, అటల్ బీహారీ వాజపేయి.. పోప్ను కలిశారు.
Had a very warm meeting with Pope Francis. I had the opportunity to discuss a wide range of issues with him and also invited him to visit India. @Pontifex pic.twitter.com/QP0If1uJAC
— Narendra Modi (@narendramodi) October 30, 2021
ఐదు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇటలీ రాజదాని రోమ్ కు చేరుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే జీ20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జీ20 సదస్సులో భాగంగా పలు దేశాధినేతలతో మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇటలీ పర్యటన అనంతరం కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని మోడీ.
రోమ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్, ఇండోనేషియా ప్రధాన మంత్రి జోకో విడొడొలను కలుసుకుంటారు. వారిద్దరితో పాటు సింగపూర్ ప్రధానమంత్రి లీ హొసెయిన్ను కూడా కలుసుకోవాల్సి ఉంది. ఇది ఇంకా షెడ్యూల్ కాలేదని సమాచారం. ఈ సాయంత్రానికి ప్రధాని టెర్మె డి డయోక్లెజియానో పోడియానికి చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీ20 దేశాధినేతలు, ఇతర అధికారులు, ప్రతినిధులతో కలిసి రాత్రి భోజనం చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలైన తరువాత ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, దాన్ని నివారించడానికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు, ఇకపై చేపట్టాల్సిన ప్రణాళికల గురించి ఈ జీ20 సమ్మిట్లో ప్రధాని చర్చిస్తారు. సమీకృత అభివృద్ధి, వాతావరణ మార్పుల గురించీ ప్రస్తావిస్తారు.
తన రోమ్ పర్యటనలో ప్రధాని మోడీ ఇదివరకే ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, ఇతర యూరోపియన్ యూనియన్ లీడర్లతో సమావేశం అయ్యారు. కోవిడ్ 19ను నివారించడానికి భారత్ చేపట్టిన చర్యలపై ఆయా యూరోపియన్ యూనియన్ దేశాధినేతలు ప్రధానిని ప్రశంసించారు. ఇటలీలో స్థిరపడిన ప్రవాస భారతీయులను కూడా ఆయన కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరకు మోడీ రోమ్లో ఉంటారు.