ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని అభినందనలు - 35 నిమిషాల చర్చలు : కీలక అంశాలపై..!!
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగుతున్న వేళ... భారత ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగి తీర్మాన ఓటింగ్ లో మూడు సార్లు భారత్ తటస్థ వైఖరి ప్రదర్శించింది. అదే సమయంలో తాము శాంతి కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ ప్రధాని రెండు సార్లు చర్చలు చేసారు. ఇక, ప్రధాని కొద్ది సేపటి క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్కాల్లో ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

ఉక్రెయిన్ కు మోదీ అభినందనలు
సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు కొనసాగిస్తుండటంపై ఉక్రెయిన్ను మోదీ అభినందించారు. సుమీలోని భారతీయులను తరలించడంలో కూడా ఉక్రెయిన్ తన సహకారాన్ని అందించాలని ప్రధాని కోరారు. అంతకుముందు ఉక్రెయిన్ కూడా సహాయం కోసం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోడీ మాట్లాడటం ఇదే తొలిసారి. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో ఉక్రెయిన్ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

పుతిన్ తో మూడోసారి మంతనాలు
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మోదీ ఫోన్లో మాట్లాడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్ను ఆర్థికంగా ఆదుకోవడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ దేశానికి 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఉక్రెయినియన్ల సంక్షేమం, ఉద్యోగుల జీతాలు తదితర ఖర్చులకు ఈ నిధులు ఉపయోగపడుతాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది.
Recommended Video

చర్చలు పరిష్కారం చూపించేనా
రష్యా ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఇజ్రాయెల్, ఫ్రాన్స్, టర్కీ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ రోజు మూడవ రౌండ్ చర్చల కోసం రష్యా ఉక్రెయిన్ ముఖాముఖిగా మరోసారి చర్చలు జరపనున్నారు. ఇంతకు ముందు రెండు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ సారి చర్చల్లో అయినా ఫలతం పైన ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications