జపాన్ ప్రధానితో మోడీ భేటీ: అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ సహా
వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడురోజుల అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన వాషింగ్టన్ డీసీలోో జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగతో సమావేశమయ్యారు. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు, సంబంధిత అధికారులు ఇందులో పాల్గొన్నారు. భారత్-జపాన్ మధ్య సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఈ అత్యున్నత స్థాయి సమావేశం ముగిసింది.
వివిధ రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలపై..
వారిద్దరి మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు.. ఫలప్రదమయ్యాయి. ఇండో-పసిఫిక్ రీజియన్ సహా పలు అంశాల్లో ఈ రెండు దేశాల ప్రధానమంత్రులు పరస్పర అంగీకారానికి వచ్చారు. ఏకాభిప్రాయాన్ని కనపర్చారు. ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన ఒప్పందాలను సుదీర్ఘకాలం పాటు కొనసాగించేలా నిర్ణయాలను తీసుకున్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్ను స్వేచ్ఛాయుత, బహిరంగ వాణిజ్య అవసరాల కోసం పరస్పరం వినియోగించుకోవాలని తీర్మానించారు.
రక్షణ శాఖలో టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవడంపై..
ద్వైపాక్షిక భద్రతా వ్యవస్థ, రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. రక్షణ పరమైన ఆయుధాలు, పరికరాలు, ఇతర ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవడానికి, అభివృద్ధి పరచుకునే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని యోషిహిడే సుగ నిర్ణయించారు. రక్షణ విభాగంలో ఆయుధ సంపత్తిని పెంపొందించుకునే విషయంలో రెండు దేశాలు పరస్పర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుందని, ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్పైనా ఫోకస్..
స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్ను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉందని, దీనికోసం ఎలక్ట్రానిక్స్ సహా కీలక రంగాల్లో టెక్నాలజీని పరస్పరం బదలాయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. యోషిహిడె సుగతో నరేంద్ర మోడీ భేటీ కావడం ఇదే తొలిసారి. అలాగే- ఆయనతో క్వాడ్ మీటింగ్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా మధ్య క్వాడ్ సమ్మిట్, క్వాడ్రిల్యాటెరల్ కో ఆపరేషన్లో భాగంగా మోడీ-యోషిహిడె సుగ భేటీ సమావేశం అయ్యారు
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్
ఈ భేటీ ముగిసిన అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా- విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా రెండు దేశాల ప్రధానమంత్రులు చర్చించారని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకోవాల్సి ఉందని చెప్పారు. తమ దేశ పర్యటనకు రావాలంటూ యోషిహిడె సుగ ప్రధానిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
Recommended Video
గ్రీన్ ఎనర్జీలో జపాన్ సహకారం..
వాతావరణ మార్పుల్లో భాగంగా కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నేషనల్ హైడ్రోజన్ మిషన్ విజయవంతం కావడంలో జపాన్ సహకారం కావాలని ప్రధాని మోడీ తన కౌంటర్ పార్ట్ను కోరినట్లు హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ఇండియా-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ సహకారాన్ని మరింత వేగవంతం చేయాలనే నిర్ణయానికి వచ్చారని చెప్పారు. ఈ భేటీ తరువాత ఇక నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ముఖాముఖి సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. దీనితో ఆయన మూడు రోజుల పర్యటన ముగుస్తుంది.