ఐఎస్ఐఎస్: బెల్జియంలో 16 మంది అరెస్టు
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో లింకులు ఉన్నాయని ఆరోపిస్తూ 16 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ప్యారిస్ దాడుల తరువాత సలా అబ్దెస్లామ్ తప్పించుకుని బెల్జియంలో తలదాచుకున్నాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో హై అలర్ట్ ప్రకటించారు.
బ్రసెల్స్ లోని ప్రతి అణువణువూ గాలిస్తున్న పోలీసు అధికారులు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. అందరిని క్షుణ్ణంగా విచారించి వివరాలు సేకరిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
అయితే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న 16 మందిలో సలా అబ్దెస్లామ్ లేడని బ్రసెల్స్ పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు సోదాలు చేస్తున్న సమయంలో నిలపకుండా వెలుతున్న ఓ కారు మీద కాల్పులు జరిపారు.
ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందనే అనుమానంతో బ్రసెల్స్ లోని అన్ని స్కూళ్లు, యూనివర్శిటీలకు సెలవులు ప్రకటించారు. అయితే వారం రోజుల పాటు బ్రసెల్స్ లో హై అలర్ట్ ప్రకటించారు.
ఇదే సమయంలో ఫ్రాన్స్ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాల మీద వైమానిక దాడులు చేస్తున్నది. మేము పార్లమెంట్ లో చర్చించిన తరువాత సిరియాలో ఐఎస్ఐఎస్ మీద వైమానిక దాడులు చేసే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని యూకే ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్యారిస్ లో చెప్పారు.