సెల్ఫీ తీసుకుంటుండగా కాల్చి చంపిన పోలీసు
ఇస్లామాబాద్: బొమ్మ తుపాకీతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ యువకుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఫైసలాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పర్హాన్ అనే యువకుడు తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో అతనికి సమీపంలో ఉన్న ఓ పోలీసు.. పర్హాన్ను దొంగగా అనుమానించాడు.
పర్హాన్ వద్ద ఉన్నది నిజమైన తుపాకీనేనని భావించిన ఆ పోలీసులు.. అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో పర్హాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, అక్కడే వున్న ఫర్హాన్ స్నేహితుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఆ తర్వాత మృతుడి వద్దకు వచ్చిన సదరు పోలీసు.. అతని వద్ద ఉన్నది బొమ్మ తుపాకీగా గుర్తించాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు, సదరు పోలీసును అరెస్ట్ చేశారు.