‘సంపన్నులకు లాభం చేకూర్చే ప్రజాస్వామ్యానికి పేద జనం డబ్బు చెల్లిస్తున్నారు’: ద ప్రైస్ ఫర్ డెమొక్రసీ పుస్తక రచయిత జూలియా కేజ్
ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది. ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయవేత్తలు ఇప్పుడు ఫ్యాషన్గా మారారు. ప్రజల చర్చ మీద ఫేక్ న్యూస్ పెత్తనం చేస్తోంది. వ్యవస్థ మీద జనానికి నమ్మకం సన్నగిల్లుతోందని, వారిలో ఆందోళన పెరుగుతోందని ఎన్నికలు ప్రతిఫలిస్తున్నాయి.
అయితే.. ఇందుకు ఒక పరిష్కారం ఉందని ఫ్రెంచ్ ఆర్థికవేత్త జూలియా కేజ్ చెప్తున్నారు. ప్రజాస్వామ్యానికి పెట్టుబడులు సమకూర్చే పద్ధతిని మార్చాలని ఆమె అంటున్నారు.
ఆర్థికశాస్త్రంలో హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్న జూలియా చాలా కాలంగా.. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో రాజకీయ పెట్టుబడుల సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక, చారిత్రక విశ్లేషణలను రాజకీయ సిద్ధాంతంతో కలుపుతూ ఆమె రాసిన పుస్తకం 'ద ప్రైస్ ఆఫ్ డెమొక్రసి' (ప్రజాస్వామ్యం వెల) తాజాగా స్పానిష్ భాషలో ప్రచురితమైంది.
రాజకీయాలకు పెట్టుబడులు, ఎన్నికల ఫలితాలు, రాజకీయ ప్రక్రియల మధ్య ఉన్న సంబంధాలను ఈ పుస్తకంలో ఆమె సమాచారంతో సహా వివరించారు.
ఈ వ్యవస్థ రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు విరాళాలు అందించే వాళ్లకు ప్రయోజనం కలిగిస్తోందని ఆమె వివరిస్తారు. అంతేకాదు.. ప్రజాస్వామ్యానికి పెట్టుబడులు సమకూరుస్తున్నట్లు కనిపించే ఇటువంటి సంపన్నులకు పన్నుల నుంచి మినహాయింపు కూడా లభిస్తోందని చెప్తారు.
ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని చర్యలు చేపట్టాలని కూడా ఆమె సూచిస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రపు అసలు స్ఫూర్తిని కాపాడటానికి.. ప్రైవేటు విరాళాల మీద పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని, పౌరులు ప్రతి ఒక్కరూ చిన్న మొత్తంలో విరాళంగా ఇచ్చే వీలు కల్పించాలని ఆమె అంటారు.
స్పెయిన్లోని కార్తజీనాలో జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవం 'హే ఫెస్టివల్' సందర్భంగా జూలియా కేజ్తో బీబీసీ ముండో ప్రతినిధి డానియెల్ పార్డో ఇంటర్వ్యూ చేశారు. అందులోని ముఖ్యాంశాలివీ...
- ప్రజాస్వామ్యం నుంచే నిరంకుశత్వం పుడుతుందని ప్లేటో ఎందుకు అన్నారు?
- ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?
ప్రశ్న: మెజారిటీ ప్రజలకు ప్రయోజనం కలిగించటం కోసమే ప్రజాస్వామ్యం పుట్టింది. కానీ ప్రజాస్వామ్యం కేవలం కొందరు సంపన్నులకే ప్రయోజనం కలిగిస్తుందని మీరు అంటున్నారు. అదెలా జరిగింది?
జవాబు: ప్రజాస్వామ్యం అనేదానిని మెజారిటీ ప్రజల ప్రయోజనం కోసం పుట్టించలేదు. కేవలం పురుషులకు, సంపన్నులకు ప్రయోజనం కలిగించటానికి మాత్రమే ప్రజాస్వామ్యాన్ని పుట్టించారు.
తొలి ప్రజాస్వామ్యాల్లో ఓటు వేసిన వారికి కానీ, పోటీ చేసిన వారికి కానీ నిర్దిష్ట స్థాయిలో సంపద కానీ, ఆదాయం కానీ ఉండి తీరాలి. ఇది సంపన్నుల కోసం పుట్టిన వ్యవస్థ.
ఆ తర్వాతి కాలంలోనే ఓటు వేయగల జనం సంఖ్యను పెంచటానికి చట్టాలు చేశారు. కనీసం ఇంత ఆదాయం, కనీసం ఇంత సంపద ఉండాలనే నిబంధనలను తొలగించారు. పురుషులందరూ ఓటు వేయవచ్చునన్నారు. ఆ తర్వాత, అది కూడా 20వ శతాబ్దపు మధ్య కాలంలో మహిళలను కూడా ఓటు వేసే వారిలో చేర్చారు.
ప్రశ్న: కానీ పాలుపంచుకునే జనం సంఖ్య పెరిగినా కూడా ఇది సంపన్నులకు ప్రయోజనం చేకూర్చే వ్యవస్థ అని మీరు అంటున్నారు?
జవాబు: అవును. ఎందుకంటే వాళ్లు ఈ మార్పులు చేసినపుడు ప్రతి ఒక్కరూ సమాన స్థాయిలో ఈ ఆటలో పాలుపంచుకునేలా చూడటానికి ఎలాంటి నిబంధనలూ నెలకొల్పలేదు.
ముఖ్యంగా రాజకీయ పెట్టుబడుల మీద - అంటే రాజకీయ పార్టీలకు, ఎన్నికల ప్రచారానికి విరాళాలు ఇవ్వటం మీద నియంత్రణ తీసుకురాలేదు.
ప్రజాస్వామ్యం అనేది తొలుత చాలా చిన్నది. ఆ తర్వాత మనం దానిని విస్తరించాం. కానీ ఈ వ్యవస్థను మైనారిటీగా ఉన్న సంపన్నులు కబ్జా చేయకుండా నిరోధించటానికి అవసరమైన వ్యవస్థలను మనం నెలకొల్పలేదు.
- అదానీ, అంబానీకి కేంద్ర బడ్జెట్తో భారీ లబ్ధి చేకూరనుందా
- అంబానీ, అదానీ.. సొంత బ్యాంకులు ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది?
ప్రశ్న: అంటే ప్రజాస్వామ్యం అన్నది ఎన్నడూ నిజంగా ప్రజాస్వామికంగా లేదంటారు?
జవాబు: కచ్చితంగా. ప్రజాస్వామ్యం అనేది ఆచరణలో మెజారిటీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వ్యవస్థగా ఎన్నడూ లేదు.
కానీ దీని అర్థం ప్రజాస్వామ్యం మంచిది కాదని కాదు. నియంతృత్వం, నిరంకుశత్వం వంటి ఇతర వ్యవస్థల కన్నా మెరుగైనది కాదని కాదు.
సమస్య ఏమిటంటే.. ఒక వ్యక్తి అంటే ఒక ఓటు అనే వ్యవస్థగా గ్యారంటీ ఉండే విధంగా మనం ప్రజాస్వామ్యాన్ని సంస్కరించలేదు.
ప్రశ్న: జనానికి ఎలా ఓటు వేయాలో తెలియకపోవటమే సమస్య, జనం అప్రజాస్వామిక అభ్యర్థులకు ఓటు వేస్తుండటమే సమస్య అని నమ్మే వాళ్లు ఉన్నారు కదా?
జవాబు: ఇది.. 'ఎలా ఉన్న పరిస్థితులను అలాగే ఉంచాలి, సంస్కరించాల్సిన అవసరం లేదు’ అనే దృక్పథం.
వాళ్లు వ్యవస్థ నిర్మాణాన్ని పరిశీలించటానికి బదులుగా.. ప్రజాస్వామ్యంలో పాలుపంచుకుంటూ ఓటు వేసే జనాన్ని తప్పుపడతారు.
అప్రజాస్వామిక రాజకీయవేత్తలకు జనం ఓటు వేయటానికి కారణం.. ఆ జనం మొరటు జనం కావటం వల్ల కాదు. వ్యవస్థలో సమస్యలను వాళ్లు గుర్తించటం వల్లే అలాంటి వారికి ఓటు వేస్తారు.
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
ప్రశ్న: ప్రతి ఒక్కరూ ఒక ఓటు అనే దానికి అడ్డుపడుతున్నదేమిటి?
జవాబు: మొదటి విషయం.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయగలగటం అని భావన ఉంది. కానీ నిజం అది కాదు. మీకు తగినంత డబ్బు లేకపోతే మీరు అధికారం కోసం ఆకాంక్షించలేరు. ప్రజాస్వామ్యం అందరికీ సమానంగా అందుబాటులో లేదు.
రెండో విషయం.. వ్యవస్థలో మన అందరికీ ఒకే స్థాయి బలం లేదు.
ఎందుకంటే.. బాగా డబ్బులున్న ఒక వ్యక్తి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి పెట్టుబడి పెడతారు. అలా పెట్టుబడులు పెట్టిన వ్యక్తికి రాజకీయ ప్రక్రియల్లో సాధారణ ఓటరు కన్నా ఎక్కువ బలం ఉంటుందని ఆధారాలు చూపుతున్నాయి.
ఎన్నికల్లో నువ్వు ఎంత ఎక్కువ డబ్బు పెట్టుబడిగా పెడితే అంత ఎక్కువగా గెలిచే అవకాశం, ప్రభావం చూపే అవకాశం ఉందని ఆధారాలు చెప్తున్నాయి.
ప్రశ్న: ప్రజాస్వామ్యంలో చాలా సమస్యలున్నాయి. ఈ వ్యవస్థలో సమస్యలను గుర్తించటానికి డబ్బు అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
జవాబు: ఇంతకుముందు నేను మీడియా మీద చేసిన పరిశోధనలో.. సంపాదక, రాజకీయ ప్రక్రియలను ప్రభావితం చేస్తున్న అతి స్పష్టమైన మార్గం డబ్బు అని గుర్తించాను. ఆ క్రమంలో ప్రజాస్వామ్యంలో డబ్బు పాత్ర మీద పరిశోధన చేయాలనే నిర్ణయం వచ్చింది.
ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీల్లో రాజకీయ పెట్టుబడుల సమాచారాన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. ఆ పరిశీలనలో రాజకీయ విరాళాలకు, ఓట్లకు మధ్య సంబంధం కనిపించటం మొదలైంది.
ఈ వ్యవస్థలో చాలా సమస్యలున్నాయి. కానీ పెట్టుబడుల అంశాన్ని విస్మరించారని నేను అనుకుంటాను. ఈ విషయంలో కొన్ని పనులు చేయవచ్చు కూడా. పెద్ద మొత్తంలో ప్రైవేటు పెట్టుబడుల మీద నియంత్రణ, ప్రభుత్వ పెట్టుబడులను మెరుగుగా, మరింత సమానత్వంతో ఉండేలా సమన్వయం చేయటం, చిన్న విరాళాల ద్వారా ప్రజలందరూ పాలుపంచుకునేలా నిర్మాణాన్ని రూపొందించటం వంటి చర్యలు చేపట్టవచ్చు.
- రిలయన్స్ జియో: టెలికాం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతుంటే 'జియో'పై కాసుల వర్షం ఎలా?
- 'ఒక దేశం.. ఒకే ఎన్నిక' కావాలని ప్రధాని మోదీ ఎందుకు కోరుకుంటున్నారు? ఏ పార్టీ వైఖరి ఏమిటి?
ప్రశ్న: రాజకీయ వ్యవస్థకు సంపన్నులు పెట్టుబడులు పెట్టటం మంచి విషయం కాదా?
జవాబు: కానీ జరుగుతున్నది అది కాదు. చాలా దేశాల్లో ఎన్నికల ప్రచారానికి పెట్టుబడులు పెట్టేవారికి పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. దాని అర్థం.. వారు తమ జేబుల్లోంచి ఆ రాజకీయ పెట్టుబడులు పెట్టటం లేదు.
చివరికి.. పేద జనం, ఎలాంటి మినహాయింపులు లేకుండా పన్నులు కడుతుంటే.. సంపన్నులు మాత్రం విరాళాలకు డబ్బులు సమకూరుస్తుస్తూ పన్నుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. సంపన్నులకు ప్రయోజనం కలిగించే ప్రజాస్వామ్యానికి పేద ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారు.
ప్రశ్న: మరైతే.. ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్యం ఫ్రాన్స్లో ఉన్నదనే మాట అబద్ధం అంటారా?
జవాబు: అది కేవలం అబద్ధం కాదు. అదో పెద్ద జోక్.
ఇవి కూడా చదవండి:
- 'నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకం,10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారించాలి - విచారణ కమిషన్ సిఫారసు
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. 'బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)