39 వేల అడుగుల ఎత్తున గాలిలో తేలిన విమానం
సింగపూర్: గాలిలో విమానం తేలిపోతున్న సమయంలో రెండు ఇంజన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలుసుకున్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. 182 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది పరిస్థితి అదే విధంగా ఉంది.
సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు క్షేమంగా ఎయిర్ పోర్టులో దిగడంతో ఊపిరిపీల్చుకున్నారు. శనివారం సింగపూర్ నుండి సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం ఎస్ క్యూ 836 చైనాలోని షాంఘై నగరానికి బయలుదేరింది.
మూడు గంటల అనంతరం విమానం 39 వేల అడుగుల ఎత్తులో ఉంది. విమానంలో 182 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆ సందర్బంలో విమానంలోని రెండు ఇంజన్లలో ఆకస్మికంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. పైలెట్ లు ఇద్దరు ఆందోళన చెందారు.
ఈ విషయం ప్రయాణికులు, విమానం సిబ్బందికి తెలిసింది. అంతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఎవరికి ఇష్టమైన దేవుడిని వారు ప్రార్థించుకుంటున్నారు. పైలెట్లు ఇద్దరు రెండు ఇంజన్లలోకి విద్యుత్ సరఫరా కావడానికి చర్యలు చేపట్టారు.
ఈ తతంగం జరుగుతున్న సమయంలో ప్రాయాణికులు ఇక తమ పని అయిపోయింది అనుకున్నారు. అయితే పైలెట్ లు రెండు ఇంజన్లలోకి విద్యుత్ సరఫరా చెయ్యడంలో సక్సెస్ అయ్యారు. అంతే ప్రయాణికులు దేవుడా అంటు ఊపిరి పీల్చుకున్నారు.
విమానం రాత్రి 10.56 గంటల సమయంలో షాంఘై ఎయిర్ పోర్టు చేరుకునింది. క్షేమంగా విమానం ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులు బయటకు పరుగు తీశారు. సింగపూర్ ఎయిర్ లైన్స్ అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు.