అమెరికన్లకు ఆశలు రేకెత్తించిన ట్రంప్ ప్రకటన: అదే రోజు 2500 మందికి మృతి: మే 1 నాటికి..!
న్యూయార్క్: కరోనా వైరస్ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వల్ల ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల నుంచి బయటికి వస్తున్నామని చెప్పారు. కరోనా తీవ్రత దశను దాటుకుని వచ్చామని అన్నారు. ఒకవంక యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. కరోనా కేసుల సంఖ్యను బట్టి చూస్తోంటే తీవ్రత తగ్గినట్టే కనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితుల ఆధారంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించుకుంటామని అన్నారు.
ఇదివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యతో పోల్చుకుంటే 72 గంటల్లో దాని వేగం ఆశించిన స్థాయిలో తగ్గిందని ట్రంప్ చెప్పారు. తాజా గణాంకాలు కాస్త ఆశలను కల్పిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీని ఆధారంగా తాము కొత్తగా మార్గదర్శకాలను రూపొందించుకుంటామని, దీనికోసం అన్ని రాష్ట్రాల గవర్నర్ల నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నామని చెప్పారు. మే 1 నాటికి పరిస్థితులు కుదురుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మే 1న కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ను ఎత్తేయడానికి అవకాశం ఉందని చెప్పారు.
ట్రంప్ ఆ ప్రకటన చేసిన రోజే.. అమెరికాల సుమారు 2600 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 28,529కి చేరుకుంది. వారం రోజుల కిందటి పరిస్థితులతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పరిమితంగా పెరగడం వల్ల ట్రంప్ తాజా ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. వైరస్ పాజిటవ్ కేసుల పెరుగుదలలో గతంలో ఉన్న వేగం ఇప్పుడు లేదని, మున్ముందు దీని తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ట్రంప్ ఈ ప్రకటన చేసిన రోజే అమెరికాలో కరోనా వైరస్ వల్ల సుమారు 2600 మంది మరణించారు. ఒక్కరోజులో ఇన్ని మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీనితో మొత్తం మృతుల సంఖ్య 28,529కి చేరుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అయినప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల మందగించడం వల్ల గడ్డు పరిస్థితులను దాటుకున్నామనే సంకేతాన్ని ఇస్తున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Recommended Video
ఒక్క న్యూయార్క్లోనే 11,586 మంది మరణించారు. పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,648కు చేరుకుంది. కరోనా వైరస్ విజృంభణ ఆరంభమైన తరువాత న్యూయార్క్లో తొలిసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య మందగమనం కనిపించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని, దీన్ని ఆధారంగా చేసుకుని కొత్త మార్గదర్శకాలను రూపొందించుకుంటున్నామని చెప్పారు.