ఇరాన్ కు సపోర్ట్ గా.. పుతిన్ షాకింగ్ రియాక్షన్..!
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. అయితే ఇరాన్ పై జరిపిన దాడుల్లో సుప్రీ లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన కేవలం 30 సెకన్లలోనే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతోపాటు దాదాపు 30 మంది సీనియర్ అధికారులు హతం అయినట్టు సమాచారం.
అయితే ఖమేనీ మృతిపై రష్యా తొలిసారిగా స్పందించింది. ఖమేనీ మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ మరణాన్ని పుతిన్ ఒక క్రూరమైన హత్యగా అభివర్ణించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఖమేనీ హత్య మానవ విలువలు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేయడం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారీ విపత్తులు సంభవించే ప్రమాదం ఉందని.. ఈ చర్య యుద్ధాలకు దారి తీయవచ్చని పుతిన్ హెచ్చరించారు.
ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు రష్యా అండగా ఉంటుందని పుతిన్ పేర్కొన్నారు. ఖమేనీ మరణం కేవలం ఇరాన్ కే కాకుండా.. ఆ ప్రాంతంలోని స్థిరత్వానికి మాయని మచ్చ అని పుతిన్ స్పష్టం చేశారు. ఈ చర్య అమెరికా దురహంకారానికి నిదర్శనం అని పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై మండిపడ్డారు. ఇక ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా గగనతలం మూసివేసిన నేపథ్యంలో రష్యా పౌరులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం దాదాపు 2 లక్షల మంది రష్యన్ వాసులు వెస్ట్ ఆసియా ప్రాంతంలో చిక్కుకుపోయినట్టు వివిధ కథనాల ద్వారా స్పష్టం అవుతోంది. రష్యాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న యూఏఈలో విమానాశ్రయాలు మూతపడటం వల్ల పర్యాటకులు, ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications