భూకంపంతో దెబ్బతిన్న నేపాల్: తైవాన్, న్యూజిలాండ్ సాయాన్ని తిరస్కరించింది
న్యూఢిల్లీ: వరుస భూప్రకంపనలతో అతలాకుతలమైన నేపాల్కు సహాయం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ముందుకొస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్న దేశాలు తమకు చేతనైన సాయం చేస్తుండగా, తాజాగా తైవాన్, న్యూజిలాండ్ దేశాలు కాడా సాయం చేయడానికి ముందుకొచ్చాయి.
అయితే, ఈ దేశాల నుంచి సాయం స్వీకరించడానికి నేపాల్ తిరస్కరించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. నేపాల్ తిరస్కరించిన విషయాన్ని న్యూజిలాండ్ విదేశాంగ శాఖ మంత్రి ముర్రే మెక్కుల్లీ మీడియాతో వెల్లడించారు.
ప్రపంచ దేశాలు సహాయం చేస్తామన్న నేపాల్ తీసుకోకపోవడానికి కారణం ఉంది. అదేమిటంటే నేపాల్లో ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దాని పేరే త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం. సహాయం అందించే పలు దేశాలు అక్కడికే తమ విమానాలను పంపుతున్నాయి.
లెక్కకు మిక్కిలిగా విమానాలు వస్తుండడంతో వాటి రాకపోకలను సరిగా నిర్వహించలేక నేపాల్ అధికారులు ఉక్రెయిన్ వంటి చిన్న దేశాలకు ఇక సహాయ విమానాలను పంపవద్దని చేప్పేసింది. విమానాశ్రయాన్ని సహాయక చర్యల కోసం వస్తున్న విమానాల కోసమే వినియోగిస్తుండగా వాణిజ్య విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.
ఇందులో భాగంగానే తైవాన్, న్యూజిలాండ్ నుంచి సహాయాన్ని నేపాల్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నాం 4 గంటల తర్వాత భూప్రకంపనలు రాకపోవచ్చని భూభౌతిక శాస్త్రవేత్తలు ప్రకటించడంతో బుధవారం నాటికి నేపాల్ యధాస్థితికి చేరుకుంటుందని సమాచార, సాంకేతిక శాఖ మంత్రి మినింద్రా రైజల్ తెలిపారు.
ఇప్పటికే నేపాల్కు చేరుకున్న సహాయక మెటీరియల్స్ను రాజధాని ఖాఠ్మండులోని వివిధ ప్రాంతాల్లో నిల్వ చేశామని, భూకంప బాధితులకు ఇంకా చేరలేదని తేల్చిచెప్పారు. హోం మంత్రి లక్ష్మీ ప్రసాద్ ధాకల్ మాట్లాడుతూ భూకంపం నుంచి బాధితులను రక్షించేందుకు మా వంతుగా అత్యుత్తమంగా పనిచేస్తున్నామని, అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
గత 80 ఏళ్లలో నేపాల్ ఇంతటి భయంకరమైన భూకంపాన్ని చూడలేదని, మృతదేహాల సంఖ్య పదివేలకు చేరవచ్చని భావిస్తున్నామని తెలిపారు. గత శనివారం నేపాల్లో రేక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపం 20 అణుబాంబులతో సమానమని శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు తమకు సన్నిహితంగా ఉండే అన్ని దేశాల నుంచి సాయాన్ని ఇప్పటికే నేపాల్ ఆర్ధించింది. గత శనివారం నేపాల్లో భూకంపం సంభవించిన తర్వాత మొదట స్పందించిన భారత్ సహాయక చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే.