‘పెరుగుతున్న అణ్వాయుధాలు, రాడికలైజేషన్: పాకిస్థాన్ చాలా ప్రమాదకరమైన దేశం!’
న్యూయార్క్: పాకిస్థాన్ చాలా ప్రమాదకరమైన దేశమని యూఎస్ మాజీ డిఫెన్స్ సెక్రటరీ జిమ్ మాటిస్ అన్నారు. ఆ దేశంలో అణ్వాయుధ శాలలు పెరిగిపోతున్నాయని, రాడికలైజేషన్ కూడా పెరిగిపోతోందని పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్(సీఎఫ్ఆర్) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాటిస్.. 'కాల్ సైన్ కోయాస్: లెర్నింగ్ టు లీడ్' అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తకానికి ఆయన సహ రచయితగా పని చేశారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ ఎందుకు ప్రమాదకరమైన దేశమని ప్రశ్నించగా.. పాకిస్థాన్ సమాజంలో రాడికలైజేషన్ పెరిగిపోయిందని, పాకిస్థాన్ మిలిటరీలోని కొందరు సభ్యుల అభిప్రాయం కూడా ఇదేనని మాటిస్ వ్యాఖ్యానించారు. అక్కడ ఏం జరుగుతుందో వారికి తెలుసని అన్నారు. పాకిస్థాన్, తమ మధ్య చాలా వక్రీకృత సంబంధం ఉందని తెలిపారు.
ఇతర దేశాల కంటే పాకిస్థాన్లో రాడికలైజేషన్ బాగా పెరిగిపోయిందని, అణ్వాయుధ శాలలు కూడా పెరిగిపోయాయని మాటిస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాల నియంత్రణ, నిరాయుధీకరణ చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
పక్క దేశమైన భారత్తో పాకిస్థాన్ సరిగా ఉండేందుకు ప్రయత్నించడం లేదని పాక్ పై మండిపడ్డారు. భారత్, పాక్ దేశాల మధ్య మరో దేశం జోక్యం వద్దని భారత ప్రధాని మోడీ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కాగా, మాటిస్ గతంలో పెర్షియన్ గల్ఫ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాల్లో సెంట్రల్ కమాండోలకు నేతృత్వం వహించారు.