నా చుట్టూ సర్కస్, వాద్రా గురించి రాహుల్ వర్రీ: లలిత్
న్యూఢిల్లీ: ‘‘నా చుట్టూ ఓ పెద్ద సర్కస్ జరుగుతోంది. నాపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమే. ఈ అంశంపై 20 రోజులపాటు పార్లమెంటును స్తంభింపచేయడమే ఇందుకు నిదర్శనం'' అని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ లండన్ నుంచి ‘ఇండియా టుడే టీవీ'కి ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఇప్పటివరకు తనకి ఎలాంటి సమన్లు అందలేదని పేర్కొన్నారు. అయితే సమన్లు ఈ మెయిల్ నుంచి పంపించారని వస్తున్న వార్తల్లో తనకెలాంటి ఈమెయిల్ అందలేదని తెలిపారు. లలిత్ మోడీ మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారంటూ పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లలిత్ మోడీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. అయితే మోడీ మాత్రం తనకెలాంటి రెడ్ కార్నర్ నోటీసులు అందలేదని చెబుతున్నారు. తాను ఎట్టి పరిస్ధితుల్లోనూ భారత్కు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అండర్ వరల్డ్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని స్కామ్లను పక్కనపెట్టి, తొలుత తన బావ రాబర్ట్ వాద్రా గురించి ఆలోచించాలని అన్నారు. లలిత్ మోడీ తన ఇంటర్యూలో ఇంకా ఏమన్నారంటే...
* నాకు ఇప్పటిదాకా ఎలాంటి సమన్లు రాలేదు.
* రాహుల్ గాంధీనికానీ, ప్రియాంక గాంధీని కానీ నేను ఎప్పుడూ కలవలేదు. రాహుల్, రాబర్ట్ వాద్రాలు నా ద్వారా లబ్ధి పొందలేదు. (వీరిని తాను కలిసినట్లు లలిత్ మోడీ గతంలో ట్వీట్ చేశారు).
* ఐపీఎల్లో నేను డబ్ల్యూఎస్జీ నుంచి డబ్బులు తీసుకున్నాననే ఆరోపణలు అవాస్తవం. అది డబ్ల్యూఎస్జీ, సోనీ మధ్య జరిగిన ఒప్పందం. నాకు ఏమాత్రం సంబంధంలేదు.
* నా ప్రాణాలకు అండర్ వరల్డ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అందుకే, నేను భారత్కు రాలేను. బీసీసీఐలో ఒక వర్గం నాకు వ్యతిరేకంగా ఉంది.
* రాజస్థాన్లో నేను సమాంతర ప్రభుత్వం నడిపానన్నది అవాస్తవం.
* వసుంధర రాజె కుటుంబంతో మాకు దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉంది. సుష్మా స్వరాజ్ కుటుంబంతోనూ మా ఫ్యామిలీకి అనుబంధం ఉంది.












Click it and Unblock the Notifications