అదే భారత్ కొంపముంచింది... అందుకే ఇంతటి సంక్షోభం... అమెరికా వైద్య నిపుణుడి సంచలన వ్యాఖ్యలు...
దేశంలో కరోనా పరిస్థితులను భారత్ సరిగా అంచనా వేయలేకపోయిందా...? వైరస్ను పూర్తిగా కట్టడి చేశామన్న భావనతో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతించడమే కొంపముంచిందా...? ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితిపై అమెరికా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాప్తిని అంచనా వేయడంలో వైఫల్యం చెందడం.. సాధారణ జనజీవితానికి అనుమతించడం వల్లే భారత్లో పరిస్థితులు ఇంతలా దిగజారాయని అమెరికా అధ్యక్షుడి ముఖ్య వైద్య సలహాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ అభిప్రాయపడ్డారు.

'తప్పుడు అంచనాలతోనే వినాశకర పరిస్థితులు..'
'కరోనాను పూర్తిగా అంతమొందించామని భారత్ తప్పుడు అంచనాలు వేసింది. ఆ అంచనాల ఆధారంగానే అన్ని రకాల కార్యకలాపాలకు,సాధారణ జనజీవితానికి తలుపులు తెరిచింది. దాంతో వైరస్ ఒక్కసారిగా విజృంభించి వినాశకర పరిస్థితులకు దారితీసింది.' అని డా.ఫౌసీ పేర్కొన్నారు. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ల విషయంలో తప్పుడు అంచనాలు ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తాయో భారత్ను చూస్తే అర్థమవుతోందన్నారు.మంగళవారం(మే 11) అమెరికా సెనేట్తో పలు అంశాలపై చర్చ సందర్భంగా ఫౌసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

'భారత్ను చూసి అమెరికా అప్రమత్తమవ్వాలి'
భారత్లో పరిస్థితులను చూసి అమెరికా కూడా భవిష్యత్తు మెడికల్ అవసరాలను సమకూర్చుకోవాలని డా.ఫౌసీ పేర్కొన్నారు. వైద్య రంగంలో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దని... భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య విపత్తులు సంభవించినా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని అమెరికా సెనేట్కు సూచించారు. కరోనా మహమ్మారి నుంచి ఒక ముఖ్య పాఠాన్ని నేర్చుకోవాల్సి ఉందన్నారు.ఇలాంటి మహమ్మారి వైరస్లను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని.. కాబట్టి అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

భారత్కు అమెరికా సాయంపై...
భారత్లో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్... అది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరు తదితర పరిణామాలను అమెరికా దృష్టిలో పెట్టుకోవాలని డా.ఫౌసీ సూచించారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేతులు కలపడం... ఈ ఏడాది జులై 4 నాటికి ఇతర దేశాలకు 60 మిలియన్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు సప్లై చేయాలన్న కమిట్మెంట్ను కలిగి ఉండటం మంచి పరిణామం అన్నారు. సెనేటర్ ముర్రే మాట్లాడుతూ... భారత్లో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ అంతమైతే తప్ప అమెరికాలోనూ అంతమొందించలేమని అన్నారు. అందుకే భారత్కు అవసరమైన మెడికల్ సాయం అందిస్తున్నామని... అంతర్జాతీయంగా కరోనాపై అవసరమైన పోరును కొనసాగిస్తున్నామని చెప్పారు.
Recommended Video

భారత్లో హై పాజిటివిటీ రేటు...
ప్రస్తుతం భారత్లోని 90శాతం ప్రాంతాల్లో కరోనా హై పాజిటివిటీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 734 జిల్లాలకు గాను 640 జిల్లాల్లో కేంద్రం నిర్దేశించిన 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్తగా హిమాచల్ ప్రదేశ్,నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ పాజిటివిటీ రేటు అధిక స్థాయికి చేరినట్లు వెల్లడించింది.దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా టాప్లో ఉన్నది. ఆ అక్కడ 48శాతం పాజిటివిటీ రేటు ఉంది. ఆ తర్వాతి స్థానంలో 37శాతం పాజిటివిటీ రేటుతో హర్యానా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో ఆరు రాష్ట్రాల్లో 50 వేల నుంచి 1లక్ష యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా 17 రాష్ట్రాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications