బ్రిటన్ ప్రధాని రేసుకు అర్హత సాధించిన రిషీ సునాక్-100 మంది ఎంపీల మద్దతు-ప్రత్యర్ధులకు సవాల్
బ్రిటన్ లో ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ అకస్మిక రాజీనామాతో మరోసారి ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. 45 రోజులకే ప్రధాని పదవి నుంచి ట్రస్ దిగిపోతున్న నేపథ్యంలో మరోసారి ప్రధానిగా ఎన్నికలకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మరోసారి గతంలో లిజ్ ట్రస్ తో పోటీ పడిన భారతీయుడు రిషి సునాక్ ను టోరీల తరఫున పోటీలో నిలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి సునాక్ పోటీ పడేందుకు దీంతో అర్హత లభించినట్లయింది.
బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీ నేత అయిన రిషి సునక్ టోరీల తరఫున ప్రధానిగా పోటీలో నిలిచేందుకు తగినంత మద్దతు లభించింది. లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో రిషి సునక్ వైపు అత్యధికులు మొగ్గు చూపుతున్నట్లు మీడియా సైతం చెబుతోంది. అయితే అదే సమయంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ పోటీలో నిలవబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. దీంతో బోరిస్ జాన్సన్ తో తలపడేందుకు రిషి సునాక్ తగిన అభ్యర్ధి అని అత్యధికులు అంచనా వేస్తున్నారు.
బ్రిటన్ ప్రధాని రేసులో టోరీల తరఫున పోటీలో నిలిచేందుకు తనకు 100 మంది ఎంపీల మద్దతు లభించినట్లు రిషీ సునాక్ ప్రకటించారు. అయితే తాను ప్రధాని రేసులో ఉంటున్నట్లు అధికారికంగా మాత్రం ఆయన ఇంకా ప్రకటన చేయలేదు. ఇప్పుడు రిషీకు పోటీగా 100కు పైగా ఎంపీల మద్దతు కూడగట్టడంలో ఆయన ప్రత్యర్దులు విఫలమైతే సహజంగానే ఆయన ప్రధాని కాబోతున్నారు. దీంతో రిషీ 100 ఎంపీల మార్క్ దాటడం ప్రాధాన్యం సంతరించుకుంది. బోరిస్ జాన్సస్ కూడా పోటీలో ఎంటరైతే అప్పుడు పరిస్దితులు ఎలా ఉంటాయన్న దానిపై రిషీ కూడా లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.