Russia Ukraine Crisis : ఇవాళ నాటో నేతలతో బైడెన్ భేటీ-ఉక్రెయిన్ పోరుపై కీలక నిర్ణయం
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇదే క్రమంలో భారీ సంఖ్యలో పౌరులు మృత్యువాత పడుతున్నా రష్యా బలగాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రష్యాకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది.
ఉక్రెయిన్ పై యుద్ధానికి కారణమైన రష్యాను కట్టడిచేసేందుకు ఓవైపు అమెరికా, నాటో కూటమి, మరోవైపు ఈయూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కీలకమైన స్విఫ్ట్ నుంచి రష్యానిు బహిష్కరించడంతో పాటు దాదాపు 30 దేశాలు ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించాయి. దీంతో పాటు రష్యాను అన్ని కూటముల నుంచి బహిష్కరించాలని, అవసరమైతే ఐక్యరాజ్యసమితి నుంచి బహిష్కరించాలని అమెరికా, నాటో దేశాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా తమపై యుద్దానికి దిగిన రష్యాపై న్యాయపరమైన చర్యల కోసం అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తోంది.

ఇదే క్రమంలో ఇవాళ నాటో దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అవుతున్నారు. ఇందులో నాటో కూటమితో పాటు ఈయూలో ఉన్న యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, జపాన్, రొమేనియా దేశాధినేతలు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో రష్యాపై వ్యవహరించాల్సిన వ్యూహాన్ని అమెరికా, నాటో దేశాలు ఖరారు చేయబోతున్నాయి. ఇందులో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని భావిస్తున్నాయి. రష్యాను కట్టడిచేసేందుకు ఇప్పటిప్పుడే ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకున్నా ఆశ్చర్యం లేకపోవచ్చు. దీంతో బైడెన్ నాటో దేశాలకు చేసే మార్గదర్శనం కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications