సడన్గా ఉక్రెయిన్లో అడుగు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్..!!
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇవ్వాళ ఉక్రెయిన్ లో అడుగు పెట్టారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ సిటీ మరియొపుల్ లో ఆకస్మికంగా పర్యటించారు. యుద్ధం ఆరంభమైన తరువాత పుతిన్ ఉక్రెయిన్ గడ్డపై అడుగు పెట్టడం ఇదే తొలిసారి.
మాస్కో: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. యుద్ధ నేరస్తుడిగా గుర్తింపు పొందారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ కారణంతో అరెస్ట్ అయ్యే పరిస్థితులను ఎదుర్కొంటోన్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ ను అందుకున్నారు. పుతిన్ ను అరెస్ట్ చేయాలంటూ ఐసీజే వారెంట్ ను జారీ చేసింది. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా వెంటనే పుతిన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

మారియుపోల్ లో..
పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ భూభాగం నుంచి ప్రజలను చట్టవిరుద్ధంగా తన దేశానికి తరలించారనే కారణంతో పుతిన్ అరెస్ట్ కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో వ్లాదిమిర్ పుతిన్ ఎవ్వరూ ఊహించని విధంగా- ఉక్రెయిన్ లో అడుగు పెట్టారు. ఆకస్మిక పర్యటన చేపట్టారు. మారియుపోల్ నగరాన్ని సందర్శించారు. రష్యా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి అధికారులు, సైన్యాధికారులు ఆయన వెంట ఉన్నారు.

రష్యా ఆధీనం..
యుద్ధం ఆరంభానికి ముందు ఉక్రెయిన్ లో భాగం ఈ మారియుపోల్ సిటీ. రష్యా సరిహద్దులకు ఆనుకునే ఉంటుంది. డొనెట్స్క్ రీజియన్ లో అతిపెద్ద నగరం ఇదే. యుద్ధం ఆరంభమైన తరువాత రష్యా సైనిక బలగాలు ఈ నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. డొనెట్స్క్ రీజియన్ మొత్తం ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉందని రష్యా.. ఉక్రెయిన్ తో యుద్ధం ఆరంభమైన తొలి రోజుల్లోనే ప్రకటించుకుంది. ఈ నగరంపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోన్నామని తెలిపింది.

హెలికాప్టర్ లో..
యుద్ధానికి ముందు సుమారుగా అయిదు లక్షల మంది జనాభా ఉన్న నగరం మారియుపోల్. యూరోప్లోని అతిపెద్ద వాటిలో అజోవ్స్టొల్ స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు తాజాగా- పుతిన్ ఆ నగరంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాస్కో నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్ లో ఆయన బయలుదేరారు. నేరుగా మారియుపోల్ లో ల్యాండ్ అయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో నగరం మొత్తాన్నీ సందర్శించారు.

పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణ..
స్థానికులతో మాట్లాడారు. ఆయనే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలను రష్యా అధికారులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. యుద్ధ సమయంలో ధ్వంసానికి గురైన భవనాలు, ఇతర కట్టడాలను రష్యా పునర్నిర్మిస్తోంది. ఆ పనులను పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు. అక్కడి శిబిరాల్లో తలదాచుకుంటోన్న వారిని కలుసుకున్నారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

చర్చనీయంశం..
యుద్ధం ఆరంభమైన తరువాత ఉక్రెయిన్ గడ్డపై పుతిన్ అడుగు పెట్టడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది. పుతిన్ పర్యటన ఉక్రెయిన్ ను మరింత రెచ్చగొట్టినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అమెరికా దీనిపై స్పందించింది. పుతిన్ చర్యను తాము ఏ మాత్రం సమర్థించలేమని వ్యాఖ్యానించింది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఉక్రెయిన్ ను మరింత రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరించారని, మారియుపోల్ నగరం రష్యా ఆధీనంలో ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని పేర్కొంది.












Click it and Unblock the Notifications