ఉక్రెయిన్పై ఈ 36 గంటలపాటు కాల్పులు జరపొద్దు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా ఆధ్యాత్మిక గురువు పాట్రియార్క్ కిరిల్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని.. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7న అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే సుమారు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని పుతిన్ ఆదేశించారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో డిసెంబర్ 25నే క్రిస్మస్ వేడుకలు జరగ్గా.. రష్యాలో తేదీ భిన్నంగా ఉండటం వల్ల క్రిస్మస్ వేడుకలు ఇప్పుడు జరుగుతాయి. రష్యాతోపాటు ఉక్రెయిన్ లోనూ కొంత మంది జనవరి 7న ఆర్థడాక్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ క్రమంలోనే యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చారుపుతిన్.
కాగా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రతిపాదనలు పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్లో తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను రష్యాలో అంతర్భాగమని అంగీకరిస్తే ఆ దేశంతో చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తో ఫోన్లో సంభాషన సందర్భంగా పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రెమ్లిన్ పేర్కొంది.
అంతేగాక, అమెరికాతోపాటు పశ్చిమదేశాల ఆయుధ సాయంపైనా పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపింది. అయితే, ఉక్రెయిన్ మాత్రం రష్యాకు తగిన గుణపాఠం చెప్పేందుకే మొగ్గుచూపుతోంది. ఇంత నష్టం జరిగిన తర్వాత తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఉక్రెయిన్ కు అమెరికాతోపాటు యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అమెరికా పంపిన ఆయుధాలు, క్షిపణులతో ఉక్రెయిన్.. రష్యా దళాలాపై విరుచుకుపడుతోంది. అంతేగకా, రష్యా ఆక్రమించిన తమ ప్రాంతాలను తిరిగి దక్కించుకునేందుకు పోరాటం చేస్తోంది.