ఉక్రెయిన్ పై అణ్వస్త్ర దాడి-వెనక్కి తగ్గిన రష్యా-విదేశాంగశాఖ కీలక ప్రకటన
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి రెండు నెలలు దాటి పోయినా ఇంకా ఫలితం తేలలేదు. ఉక్రెయిన్ లో అణువణువూ ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్న రష్యాకు యుద్ధ దాహం తీరడం లేదు. అయితే పశ్చిమదేశాల సాయంతో తమను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ పై రష్యా అణుదాడి చేసి తీరుతుందన్న ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ఇవాళ రష్యా క్లారిటీ ఇచ్చింది.
రష్యా ఉక్రెయిన్లో అణ్వాయుధాలను ఉపయోగించబోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అలెక్సీ జైట్సేవ్ ఇవాళ చెప్పారు. రష్యా అణ్వాయుధాలను ఉపయోగించడం అనేది పాశ్చాత్య అధికారులు బహిరంగంగా చర్చించిన ప్రమాదం అని .. రష్యా తన ప్రత్యేక సైనిక ఆపరేషన్ అని పిలిచే దానికి ఇది వర్తించదని జైట్సేవ్ విలేకరులతో అన్నారు. దీంతో రష్యా ఉక్రెయిన్ పై అణుదాడి విషంలో పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తేలిపోయింది.
వాస్తవానికి అమెరికా సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ ఏప్రిల్ 14న ఉక్రెయిన్లో రష్యా ఎదుర్కొన్న ఎదురుదెబ్బలను దృష్టిలో ఉంచుకుని, "వ్యూహాత్మక అణ్వాయుధాలు లేదా తక్కువ ప్రభావవంతమైన అణ్వాయుధాల ద్వారా ఎదురయ్యే ముప్పును మనలో ఎవరూ తేలికగా తీసుకోలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉక్రెయిన్ పై రష్యా ఏదో ఒక దశలో అణు యుద్ధం చేసి తీరుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు రష్యా ఆ విషయంలో స్పష్టత ఇచ్చేయడంతో ఉక్రెయిన్ విషయంలో రష్యాను దోషిగా చూపేందుకు ఇది అమెరికా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.