భారత్కు బంపర్ ఆఫర్! రష్యా ఆయిల్కు అమెరికా గ్రీన్ సిగ్నల్
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరల స్థిరత్వానికి, సరఫరా కొరతను అధిగమించడానికి అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చే ముడి చమురు (క్రూడాయిల్) కొనుగోళ్లపై గతంలో విధించిన ఆంక్షల మినహాయింపును అమెరికా ట్రెజరీ శాఖ మరో 30 రోజుల పాటు, అంటే జూన్ 17 వరకు పొడిగిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గతంలో ఉన్న గడువు శనివారంతో ముగిసిపోవడంతో, పలు దేశాల అభ్యర్థన మేరకు అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ (ట్రెజరీ సెక్రటరీ) స్కాట్ బెస్సెంట్ ఈ మినహాయింపును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురు రవాణా నౌకలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ముఖ్యంగా రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసే భారతదేశానికి ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. అయితే, అమెరికా ఆంక్షలతో మాకు సంబంధం లేదని, తమ సొంత ఇంధన భద్రత కోసం రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను కొనసాగిస్తూనే ఉంటామని భారత్ నిన్ననే స్పష్టం చేయడం ఇక్కడ గమనార్హం.

ఆంక్షల మినహాయింపు వెనుక అసలు కారణం ఏంటి?
అమెరికా ట్రెజరీ ఇలా ఆంక్షల నుండి మినహాయింపు ఇవ్వడం ఇది రెండోసారి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరగడం, అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) మూసివేత వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో చమురు కొరత ఏర్పడింది. ఈ సరఫరా కొరతను తగ్గించి, అంతర్జాతీయంగా చమురు ధరలు అదుపు తప్పకుండా చూసేందుకే అమెరికా ఈ తాత్కాలిక మినహాయింపుల వ్యూహాన్ని అమలు చేస్తోంది.
అయితే, అమెరికా తీసుకున్న ఈ చర్యల వల్ల ఆ దేశంలో గ్యాసోలిన్ ధరలు తగ్గడం గానీ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పూర్తిగా అదుపులోకి రావడం గానీ జరగలేదు. కానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మాస్కోపై అమెరికా ఆంక్షల ఒత్తిడి పెంచకముందు రష్యా చమురును భారీగా కొనుగోలు చేసిన భారత్ వంటి దేశాలకు ఈ నిర్ణయం బాగా కలిసి వస్తోంది.
ఒకవైపు రష్యాకు రిలీఫ్.. మరోవైపు ఇరాన్కు బిగిస్తున్న ఉచ్చు!
రష్యా చమురుకు తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినప్పటికీ, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో సరఫరా ఆందోళనలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మరోవైపు శాంతి చర్చల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా ఎత్తివేసే యోచనలో ఉందంటూ ఇరాన్ మీడియా కథనాలు వండి వార్చింది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు బ్యారెల్కు సుమారు 1.5 శాతం పెరిగి 111 డాలర్లకు చేరుకోవడం మార్కెట్ తీవ్రతను సూచిస్తోంది.
ఇదిలా ఉంటే, పారిస్లో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) ఆర్థిక వ్యవస్థల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఇరాన్పై మరింత కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
"ఇరాన్ తన యుద్ధ యంత్రాంగాన్ని నడపడానికి వాడుతున్న అక్రమ ఆర్థిక వనరులను, కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలి. ఆ డబ్బును తిరిగి ఇరాన్ ప్రజలకే చెందేలా చూడాలి. ఇందుకోసం G7 దేశాలతో పాటు మా మిత్రదేశాలన్నీ ఇరాన్పై విధించిన ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని కోరుతున్నాం." అని అన్నారు
అంటే, ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ స్థిరత్వం కోసం రష్యా చమురుకు అమెరికా రహదారిని సుగమం చేస్తూనే, మరోవైపు ఇరాన్ ఆర్థిక వనరుల ముగింపునకు అంతర్జాతీయ దేశాల మద్దతును కూడగడుతోందన్నమాట!














Click it and Unblock the Notifications