పాక్ కు నేపాల్ భారీ షాక్ : ఇస్లామాబాద్ నుంచి వేదిక మార్పు
న్యూఢిల్లీ : దౌత్య వేదికల మీద పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలన్న భారత్ వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగా నవంబర్ లో పాక్ లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన సార్క్ సమావేశాలను భారత్ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్ కు మద్దతుగా బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా సదస్సుకు హాజరుకాలేమని తేల్చేశాయి.
పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ: బంగ్లాదీ అదే వాదన
ఇదంతా ఇలా ఉంటే.. సార్క్ దేశాలకు నేతృత్వం వహిస్తోన్న నేపాల్ కూడా సదస్సును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేపాల్ ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఆ దేశ ప్రధాని ప్రచండ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సార్క్ సదస్సు రద్దు ద్వారా పాక్ ను భారత్ వ్యూహాత్మకంగా తొలి దెబ్బ కొట్టగలిగింది. కాగా, ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన సార్క్ సమావేశాలను రద్దు చేసిన నేపథ్యంలో.. సమావేశాలను మరో దేశ వేదిక ద్వారా నిర్వహించాలని నేపాల్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అంతర్జాతీయంగా పాక్ పై భారత్ వ్యూహాత్మక వైఖరి పలుదేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇండస్ వాటర్ నిలుపుదల, పాక్ తో వాణిజ్య సంబంధాల రద్దు వంటి అంశాలను సమర్థిస్తూ అమెరికా డెయిలీ న్యూస్ పేపర్ 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రశంసించింది. భారత్ వ్యూహాత్మాక సహనాన్ని పరీక్షించడం పాక్ కు అన్నివేళలా పనిచేయదని ఒకింత పాక్ ను గట్టిగానే మందలించింది వాల్ స్ట్రీట్.