మహిళా ఉద్యోగులపై వ్యాఖ్యలు: సత్య నాదెళ్ల క్షమాపణ
శాన్ఫ్రాన్సిస్కో: మహిళలపై చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల గురువారం మహిళలకు క్షమాపణలు చెప్పారు. అంతకుముందు ‘ఉద్యోగాలు చేసే మహిళలు తమ జీతాల పెంపు విషయంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి' అని అన్నారు. అమెరికాలోని ఆరిజోనాలో ఓ సదస్సులో సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళలు కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నా, జీతాల పెంపు విషయంలో మాత్రం అసలు సంతృప్తిగా ఉండట్లేదని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించినప్పుడు నాదెళ్ల పై విధంగా స్పందించారు. మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాలని, అప్పుడు మనకు పెరగాల్సిన జీతం అదే పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. మహిళలు తమ జీతాల పెంపు గురించి అడగక్కర్లేదని, వాళ్లు సత్కర్మలు చేస్తే ఆ పుణ్యం తిరిగొస్తుందని అన్నట్లు తెలిసింది.

కాగా, సత్య నాదెళ్ల వ్యాఖ్యలతో ఇదే సదస్సుకు సంధానకర్తగా వ్యవహరించిన మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యురాలు, కాలేజీ ప్రెసిడెంట్ మారియా క్లావే విభేదించారు. ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా కార్యక్రమానికి హాజరైనవారు కరతాళధ్వనులు చేశారు. ‘ఒకే ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకు తక్కువ జీతాలు వస్తున్నాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. దీన్ని కూడా పరిష్కరించాలని, ఇందుకోసం మహిళలు హోంవర్క్ చేయాలి' అని క్వేవ్ సూచించారు.
నాదెళ్ల వ్యాఖ్యలపై పలువురు మహిళలు, మహిళా ఉద్యోగినుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నాదెళ్ల వ్యాఖ్యలపై భారత్కు ఇంటిగ్రల్ మాస్టర్ కోచ్ అపర్ణ జైన్ మండిపడ్డారు. సత్య నాదెళ్ల మాటలను మహిళలు పట్టించుకోవద్దని అన్నారు. మరికొందరు మహిళలు కూడా నాదెళ్ల వ్యాఖ్యలను ఖండించారు.
ఆ తర్వాత ఈ వివాదానికి తెరదించుతూ సత్య నాదెళ్ల.. ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. పరిశ్రమలో వేతనాల విషయంలో లింగ వివక్ష తగ్గాలని ఆయన అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ మహిళలకు సూచించడంపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు, మహిళలకు క్షమాపణ చెబుతూ ఓ మెమో కూడా పంపారు. ఆ ప్రశ్నకు అంతకుముందు తానిచ్చిన సమాధానం కూడా తప్పని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications