మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెల్లనే: బిల్ గేట్స్ కొత్త పాత్ర
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో) పదవి విషయంలో హైదరాబాదీయే గెలిచాడు. హైదరాబాదుకు చెందిన సత్య నాదెల్ల మైక్రోసాఫ్ట్ తదుపరి సిఇవోగా నియమితులయ్యారు. స్టీవ్ బల్మేర్ స్థానంలో ఆయన సిఇవోగా ఎంపికయ్యారు. బల్మేర్ ఆగస్టులో సిఇవోగా తప్పుకోనున్నారు.
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ మూడో సిఇవో కానున్నారు. 39 ఏళ్ల చరిత్రలో మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడో సిఇవోను మాత్రమే చూడబోతోంది. తొలి సిఇవో వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కాగా రెండో సిఇవో బల్మేర్. మైక్రోసాఫ్ట్లో నాదెల్ల గత 22 ఏళ్లుగా పనిచేస్తున్నారు. నిజానికి, సత్య నాదెల్ల స్వస్థలం అనంతపురం జిల్లా బుక్కాపురం గ్రామం.
కాగా, బిల్ గేట్స్ సాంకేతిక సలహాదారుగా కొత్త పాత్ర నిర్వహించనున్నాడు. బిల్ గేట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నారు. 46 ఏళ్ల సత్య నాదెల్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. మంగళూర్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రకిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
సత్య నాదెల్ల ఆ తర్వాత చికాగో విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. పాఠశాల జట్టులో అతను ఆడుతూ వచ్చాడు. జట్టుతో కలిసి పనిచేయడం క్రికెట్ ఆడడం వల్ల నేర్చుకున్నానని, జీవితమంతా తనకు నాయకత్వం ఉందని సత్య నాదెల్ల అన్నారు.