ఉజ్బెక్లో మోదీ: పుతిన్ సహా చైనా అధ్యక్షుడితో ముఖాముఖి భేటీ..!!
తాష్కెంట్: ఆసియా దేశాల్లో అత్యంత కీలకమైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం ఇవ్వాళ ప్రారంభం కానుంది. ఈ ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వం ఉన్న దేశాధినేతలు, ప్రధానమంత్రులు సదస్సులో పాల్గొననున్నారు. భారత్, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజకిస్తాన్కు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ దఫా ఉజ్బెకిస్తాన్ దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. సమర్ఖండ్లో ఈ సదస్సు ఏర్పాటైంది.
ఇందులో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్కండ్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఎస్సీఓ సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, విస్తరణ, పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై మరింత లోతుగా చర్చిస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల రెండు సంవత్సరాల తరువాత ఈ భేటీ ఏర్పాటైంది. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ- రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, గ్ఝీ జిన్పింగ్ను కలుసుకోనున్నారు.

సమర్ఖండ్ విమానాశ్రయంలో దిగిన ప్రధానికి ఉజ్బెకిస్తాన్ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్, మంత్రులు, సమర్కండ్ రీజియన్ గవర్నర్, సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. సమ్మిట్ సందర్భంగా ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఎస్సీఓ సభ్య దేశాల కార్యకలాపాలను సమీక్షించనున్నారు. భవిష్యత్తులో పరస్పర సహకారం, దౌత్య సంబంధాలు, వాణిజ్య-ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, ఇంధన వనరులపై చర్చించనున్నారు. లాజిస్టిక్ అంశం కూడా ప్రధానంగా ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రస్తావనకు రానుంది.
ఈ సదస్సుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరవుతున్నారు. ఆయనతో మోదీ ముఖాముఖి భేటీలో పాల్గొనే అవకాశాలు దాదాపు లేవనే తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ముఖాముఖి సమావేశాలకు మోదీ హాజరవుతారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్లతో సమర్కండ్లో ద్వైపాక్షిక సమావేశాలను మోదీ నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications