వైమానిక దాడులు: ఐఎస్ఐఎస్ నాయకుడు అంతం
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ లీడర్, అతని అనుచరులను అమెరికా వైమానికదళం మట్టుబెట్టింది. ఉగ్రవాదులు తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే వైమానిక దాడులు జరిగాయి.
ఉగ్రవాదుల ప్రాభల్యం ఉండే అన్బార్ ప్రావిన్స్ చీఫ్ గా పని చేస్తున్న అబూ వాహిబ్ అనే ఉగ్రవాద నాయకుడు, అతని ముగ్గురు అనుచరుల మీద అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ వైమానిక దాడుల్లో అబూ వాహిబ్ తో సహ అతని ముగ్గురు ముఖ్య అనుచరులు అంతం అయ్యారు.
ఈ విషయాన్ని పెంటాగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ స్పష్టం చేశారు. ఒకప్పుడు అబూ వాహిబ్ ఆల్ ఖైదా ఉగ్రవాదుల సభ్యుడిగా ఉండేవాడని అమెరికా తెలిపింది. తరువాత ఇస్లామిక్ స్టేట్ లో చేరి పలు దాడులు, అరాచకాలు చేశాడు. ఎన్నో దాడులకు ప్రణాళికలు రచించాడు.
విషయం తెలుసుకున్న అమెరికా సైన్యం అబూ వాహిబ్ ను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు చెయ్యాలని నిర్ణయించింది. అమెరికా వైమానిక దళాలు అబూ వాహిబ్ జాడను గుర్తించింది. రుత్బా అనే ప్రాంతంలో తల దాచుకున్న అబూ వాహిబ్ స్థావరాలపై దాడులు చెయ్యగా అతను అంతం అయ్యాడు. నాయకత్వం అనేది లేకుండా చేస్తే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అంతం అవుతారని అమెరికా భావిస్తున్నది.
అందు కోసం తమ వ్యూహంలో భాగంగా వాయుసేనలతో కలిసి చేస్తున్న దాడుల్లో ఇస్తామిక్ స్టేట్ ఉగ్రవాద నాయకులు ఒక్కోక్కరు అంతం అవుతున్నారు. తామకు మద్దతు ఇస్తున్న దేశాల సహాయంతో చేస్తున్న వైమానిక దాడుల్లో ఉగ్రవాద నాయకులు అంతం అవుతున్నారని, ఇది తమ విజయం అని, ఇలాంటి దాడులు ఇంకా చేస్తామని ఇరాక్ కు చెందిన మిలటరీ అధికారులు అంటున్నారు.