పాకిస్ధాన్లో హిందూ యువతికి ఉద్యోగం నిరాకరణ
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్ధాన్ ఆసియాలో రెండు దేశాలు. ఈ రెండు దేశాలను బోర్డర్ వేరు చేస్తుంది. భారత్లో ముస్లింలు, పాకిస్ధాన్లో హిందువులు నివసిస్తున్నారు. వీరిద్దరూ కూడా తమ తమ దేశాల్లో మైనారిటీలుగా ఉన్నారు.
అయితే రెండు దేశాల్లో వీరిని ట్రీట్ చేసే పద్ధతి మాత్రం వేరుగా ఉంటుంది. పాక్లో 'హిందూ' అంటూ సంధ్య అనే యువతికి ఉద్యోగం నిరాకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బీబీసీ హిందీకి పెషావర్కు చెందిన ఉరూజ్ జఫ్రీ అనే యువతి ఈ ఉదంతాన్ని వివరించింది.
పాకిస్ధాన్లోని పెషావర్ పట్టణంలో సుమారు 1200 నుంచి 1500 వరకు హిందు కుటుంబాలు జీవిస్తున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రొవిన్స్లో అయితే 47,000 హిందు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని జప్రీ తెలిపారు.
అక్కడ జీవనం సాగించే ఎక్కువ మంది హిందువులు బాల్మీకి కులానికి చెందినవారు. ఎంతో చరిత్ర కలిగి ఉన్న కాలి బారీ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. ఆ ప్రాంతంలో బిషన్ దాస్ అనే కుటుంబాన్ని జఫ్రీ కలవడం జరిగింది.
బిషన్ దాస్ తన కూతురు సంధ్యని చిన్న తనం నుంచే ఇంగ్లీషు మీడియం పాఠశాలకు పంపించి, మాస్టర్స్ డిగ్రీ చదివించాడు. తన తండ్రి ఆరోగ్య కారణాల రీత్యా సంధ్య ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని ఆమె చదువుకున్న విద్యా సంస్ధకు వెళ్లడంతో ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. అందుకు కారణం ఆమె పాకిస్ధానీ హిందూ కావడమే.
'నువ్వు హిందూ స్త్రీవి' నీకు మేము ఇక్కడ ఉద్యోగం ఇవ్వలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. పాకిస్ధాన్లో హిందువులు మైనారిటీలన్న సంగతి తెలిసిందే. భారత్లో ముస్లింల స్ధితిగతులతో పోలిస్తే, పాక్లో హిందువులు దుర్భర స్ధితిలో గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే, భారత్లో ముస్లిం అంటూ ఓ యువకుడికి ఉద్యోగం నిరాకరించడం, ముంబైలో మరో యవతికి ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం లాంటి సంఘనలు కూడా పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.