ఎంహెచ్ 370: కీలక ఆధారం లభ్యం, కూలిపోయిందా?
కౌలాలంపూర్: అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 అన్వేషణకు ఒక కీలకమైన ఆధారం లభించిందని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. కౌలాలంపూర్లో మలేసియా రక్షణ శాఖ మంత్రి హిషముద్దీన్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొన్న అంశాలను ఆధారం చేసుకుని తమ అన్వేషణ నిర్ధేశిత మార్గంలో సాగుతుందన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించిన శకలాలు మలేసియా విమానానివే అని నిర్థారించే వరకు అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు.
పదమూడు రోజుల క్రితం గల్లంతైన విమానం కోసం అన్వేషించే కార్యక్రమంలో 18 ఓడలు, 29 విమానాలు, 6 హెలికాప్టర్లు పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ, మధ్య ఆసియా వరకు రెండు కారిడార్లు జల్లెడపడుతున్నాయని ఆయన తెలిపారు.
కాగా, మలేషియా విమానం హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఆస్ట్రేలియా ప్రధాని వెల్లడించిన తాజా సమాచారం ఈ కథనాలకు బలం చేకూర్చుతుందంటున్నారు. ఒకవేళ దక్షిణ మహాసముద్ర తీర ప్రాంతంలో గుర్తించిన శకలాలు మలేషియన్ విమానానివే అయితే.. ప్రమాదం జరిగి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, మలేషియా విమానం మిస్టరీని ఛేదించడానికి అధికారులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. బోయింగ్ను నడిపిన పైలట్ జహరీ అహ్మద్ షా ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న విమాన నేవిగేషన్ సిములేటర్లోని కొన్ని పైళ్లను తొలగించినట్లు వారు గుర్తించారు. మిస్టరీ చేధించేందుకు ఈ ఫైళ్ల సమాచారం కీలకం కానుందని భావిస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పిన శకలాల ప్రాంతానికి నార్వే షిప్ చేరుకుంది.