స్పృహతప్పి కిందపడ్డ సింగపూర్ ప్రధాని, భయపెట్టానని..
సింగపూర్: సింగపూర్ ప్రధానమంత్రి లీ లూంగ్ జాతీయ దినోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తూ స్పృహతప్పి కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న మంత్రులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రధానిని పట్టుకొని స్టేజీ కిందకు తీసుకు వెళ్లారు వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
ప్రధాని ఆదివారం నాడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడున్న వారంతా కంగారుపడ్డారు. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలో ఆయన ప్రసంగం చూస్తున్నవారందరికీ ఏం జరిగిందో అర్థంకాక ఆందోళన చెందారు.
51వ జాతీయ దినోత్సవం జరిగింది. సంప్రదాయం ప్రకారం దేశ ఆర్థిక, రాజకీయ, పాలసీల గురించి ప్రసంగిస్తుండగా ఆయన కిందపడ్డారు. బాగా అలిసిపోవడం వల్ల అస్వస్థతకు గురైన లీ వెంటనే కోలుకున్నారు. ఆ తర్వాత గంటకు తిరిగి వేదికపైకి వచ్చిన లీ ప్రసంగం పూర్తి చేశారు.
ఆయన మళ్లీ వేదికపైకి రాగానే అక్కడున్న వారంతా మర్యాదపూర్వకంగా లేచి నిలుచున్నారు. వేచి ఉన్నందుకు లీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అందరినీ భయపెట్టేశాను అంటూ నవ్వేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, ఈ వేడుకలు ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటానన్నారు.