ఘోర రోడ్డుప్రమాదం: 12 మంది సజీవదహనం
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు చిన్నారులతోపాటు 12 మంది సజీవ దహనమయ్యారు. బుధవారం ఉదయం షేఖ్పుర జిల్లాలో ప్రయాణిస్తున్న ఓ పోలీసు అధికారి కారు ఎదురుగా వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో వాహనంలో మంటలు చెలరేగాయి.
దీంతో రిక్షాకు నిప్పు అంటుకుని రిక్షాలోని ఆరుగురు చిన్నారులతోపాటు 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మహిళా కళాశాల సమీపంలో కాల్పులు
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ఓ మహిళా కళాశాల వద్ద బుధవారం కాల్పులు జరిగాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినపడటంతో విద్యార్థినులందరూ భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు.

రావల్పిండి ప్రాంతంలోని వకార్-ఉన్-నిసా ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు, దొంగలకు మధ్య కాల్పులు జరగ్గా, ఉగ్రవాదులు దాడికి పాల్పడి ఉంటారనే అపోహతో విద్యార్థినులు భయాందోళనలకు గురై పరుగులు పెట్టినట్లు పోలీసు అధికారి సుల్తాన్ వెల్లడించారు.
ఈ ఘటనతో ఎవరు భయపడ వద్దని ఉగ్రవాదుల దాడి కాదని పోలీసులు వెల్లడించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినపడే సరికి భయపడిన విద్యార్థినులు కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.
కాగా, గతంలో పెషావర్ పాఠశాలలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 150మందికిపై విద్యార్థుల ప్రాణాలు పొట్టనపెట్టుకోగా, ఈ ఏడాది జనవరి 20న బచాఖాన్ విశ్వవిద్యాలయంపై తాలిబన్లు కాల్పులు జరపడంతో 21 మంది విద్యార్థులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications