217 మంది మృతి..? కారణం అదే ??
ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రజల ఆగ్రహం భద్రతా దళాలపైకి మళ్లడంతో, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టెహ్రాన్లోని పరిస్థితులు అత్యంత భయానకంగా మారినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఒక్క టెహ్రాన్లోనే 217 మంది మృతి..?
టైమ్ మ్యాగజైన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓ ఇరాన్ వైద్యుడు సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్క టెహ్రాన్ నగరంలోనే ఇప్పటివరకు 217 మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేశారు. మృతుల్లో అధికశాతం యువకులే ఉండటం ఆందోళన కలిగించే విషయమని స్పష్టం చేశారు.

కాగా ఉత్తర టెహ్రాన్లోని ఒక పోలీస్ స్టేషన్ సమీపంలో నిరసనకారులపై భద్రతా దళాలు మెషిన్ గన్లతో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో కనీసం 30 మంది ఆందోళనకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో అనేకమంది తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
అంతే కాకుండా నిరసనలు, మరణాల వివరాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లను పూర్తిగా నిలిపివేసిందని సదరు వైద్యుడు వెల్లడించారు. దీనివల్ల అసలు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ప్రపంచానికి పూర్తిగా తెలియడం లేదని పేర్కొన్నారు. స్థానిక నివేదికల ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువగా ఉండగా.. అంతర్జాతీయ మీడియా మాత్రం ఇప్పటివరకు 65 మంది మృతి చెందినట్లు మాత్రమే చెబుతుందన్నారు.
ఖమేనీ ఆగ్రహం..
ఈ ఉద్రిక్త పరిస్థితులపై ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి.. "ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిచాయి" అంటూ మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడిని సంతోషపరచడానికి ఇరాన్ ప్రజలు తమ సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా ప్రవాసంలో ఉన్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ దాడుల్లో అనేకమంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ పరిస్థితుల్లో అమెరికా జోక్యం చేసుకుని ప్రజలకు మద్దతు ఇవ్వాలని కోరారు. నిరసనకారుల స్వరాన్ని అంతర్జాతీయ వేదికలపై వినిపించాలని కూడా ఆయన అభ్యర్థించారు.
ఇరాన్పై మరిన్ని ఆంక్షల అవకాశం?
ఇరాన్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పౌరులపై భద్రతా దళాల కాల్పులను ఖండిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఇరాన్పై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ప్రభుత్వ దమనకాండ, సమాచార ఆంక్షలు, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్ల మధ్య దేశం ఒక తీవ్రమైన సంక్షోభం వైపు దూసుకెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications