కన్న బిడ్డను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన తల్లి
జోహన్నెస్బర్గ్: పేగు బంధాన్ని మరిచి ఓ కన్న తల్లి తనకు పుట్టిన కొడుకును అమ్మేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆ బిడ్డను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 20ఏళ్ల మహిళ తాను జన్మనిచ్చిన 19 నెలల కొడుకును విక్రయిస్తానంటూ ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. ధర 380డాలర్లుగా నిర్ణయించింది. ప్రకటన ఇచ్చిన కొద్ది రోజులకు ఒక భారతీయ మహిళ ఆమెకు ఫోన్చేసి బాబును తాను కొనుగోలు చేస్తానని చెప్పింది.

దీంతో వారు ఉండే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో ఇద్దరు మహిళలు కలుసుకున్నారు. భారతీయ మహిళ ఆమెకు 380డాలర్లు ఇచ్చి బాలుడిని సొంతం చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడి తల్లిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తన బాయ్ఫ్రెండ్ బిడ్డకు తండ్రిగా ఉండేందుకు ఒప్పుకోలేదని.. అందుకే బిడ్డను అమ్మకానికి పెట్టినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం ఆ చిన్నారిని శిశుసంరక్షణ కేంద్రానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ప్రస్తుతం ఆమె బెయిలుపై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications