కొరియా అధ్యక్షుడిని దింపేసిన పార్లమెంట్..
South Korea: ఊహించినట్టే- దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్.. అభిశంసనకు గురయ్యారు. పార్లమెంట్ ఆయనకు ఉద్వాసన పలికింది. సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. ప్రధానమంత్రి హ్యాన్ డుక్-సూ.. తాత్కాలిక అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు.
యూన్ సుక్ అభిశంసనకు గురైన వెంటనే- దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. దక్షిణ కొరియన్లందరూ రోడ్ల మీదికి వచ్చి సంబరాలు చేసుకున్నారు. రాజధాని సియోల్, బుసాన్, డేగు, ఇంచియాన్, గ్వాంగ్ఝు, ఉల్సాన్ వంటి నగరాల్లో జనం భారీ సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు. పలుచోట్ల విజయోత్సవాలను నిర్వహించారు.

దేశంలో మార్షల్ లాను ప్రవేశపెట్టడానికి యూన్ సుక్ సాగించిన ప్రయత్నాలే ఆయనను పదవీచ్యుతుడిని చేశాయి. మార్షల్ లాకు వ్యతిరేకంగా వారం రోజులుగా దక్షిణ కొరియా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిరహిస్తూ వచ్చారు. పలుచోట్ల ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను దగ్ధం చేశారు.
మార్షల్ లా ప్రవేశపెట్టే విషయంలో అధికార పీపుల్ పవర్ పార్టీ ఆఫ్ కొరియా నిలువునా చీలింది. మెజారిటీ సభ్యులు మార్షల్ లాకు వ్యతిరేకంగా నిలిచారు. ప్రధాన ప్రతిపక్షం సారథ్యంలో మిగిలిన అయిదు పార్టీలు కలిసి రోజుల కిందటే ఈ యూన్ సుక్పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
దీనిపై తాజాగా కొరియా పార్లమెంట్ స్పీకర్ వూ-వన్ షిక్ ఓటింగ్ నిర్వహించారు. అధికార పీపుల్ పవర్ పార్టీకి చెందిన చీలిక వర్గం సైతం ప్రతిపక్షంతో చేతులు కలిపింది. మొత్తం 300 మంది సభ్యులు ఉండే దక్షిణ కొరియా పార్లమెంట్.. నేషనల్ అసెంబ్లీలో అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటు వేశారు. మిగిలిన వారు దానికి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
తీర్మానం ఆమోదం పొందాలంటే 200 మంది సభ్యుల బలం అవసరమౌతుంది. 204 మంది అనుకూలంగా ఓటు వేయడంతో ఈ తీర్మానం సభామోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. యూన్ సుక్ పదవీచ్యుతుడైనట్టయింది. ఆ వెంటనే ప్రధానమంత్రి హ్యాన్ డుక్-సూను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు సభ్యులు.












Click it and Unblock the Notifications