టైమ్స్స్క్వేర్ వద్ద కారు బీభత్సం: యువతి మృతి, 22మందికి గాయాలు(వీడియో)
డ్రగ్స్ మత్తులో నేవీ మాజీ ఉద్యోగి అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. మనుషుల గుంపుపైకి దూసుకెళ్లడంతో ఓ యువతి మృతి చెందగా, 22మంది తీవ్రగాయాలపాలయ్యారు.
వాషింగ్టన్: డ్రగ్స్ మత్తులో నేవీ మాజీ ఉద్యోగి అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. మనుషుల గుంపుపైకి దూసుకెళ్లడంతో ఓ యువతి మృతి చెందగా, 22మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
భయానక వాతావరణం
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన టైమ్స్ స్క్వేర్ సమీపంలోని 42 స్ట్రీట్లో మద్యం, డ్రగ్స్ తీసుకున్న ఓ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి రిచర్డ్ రోజస్ కారు వేగంగా నడిపాడు. సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకుని కొన్ని సెకన్లలోనే జనాలపై దూసుకెళ్లి భయానక వాతావరణం సృష్టించాడు.
బెంబేలెత్తిన జనం
కారు ఛేజ్ బ్యాంకు వద్దకు రాగానే రోడ్డుపై వెళుతున్న దాదాపు 10మందిపైకి దూసుకెళ్లింది. ఇలా ఒక్కసారిగా కాదు. ఏకంగా మూడుసార్లు జనాలపైకి కారుతో వేగంగా మనుషులపై ఎక్కించాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామాణానిిక జనాలు బెంబేలెత్తిపోయి పరుగులు తీశారు.
యువతి అక్కడికక్కడే..
కాగా, ఈ ప్రమాదంలో ఎలీసా ఇల్స్మాన్ అనే ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో 22మంది తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. కాగా, గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పారిపోతున్న నిందితుడిని..
ఘటన స్థలం నుంచి పారియేందుకు పరుగెత్తిన నిందితుడు రిచర్డ్ను కొందరు వ్యక్తుల సాయంతో న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో.. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, ఓ వ్యక్తి మద్యం, డ్రగ్స్ మత్తులో చేసిన అరాచకమని అన్నారు. కాగా, ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.