Sri lanka Crisis : ముదురుతున్న సంక్షోభం-నిరసనకారుల్ని చర్చలకు పిలిచిన ప్రధాని మహీంద
శ్రీలంకలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న నిరసనకారులు ఏకంగా ప్రధాని, అధ్యక్షుడి నివాసాల దగ్గరే నిరసనలకు దిగుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని మహీంద రాజపక్స కోరుతున్నా నిరసనకారులు శాంతించడం లేదు. దీంతో ఆయన ఇవాళ మరో ఆఫర్ ఇచ్చారు.
శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజపక్సే అధ్యక్ష కార్యాలయ ప్రవేశ ద్వారం ఆక్రమించుకున్న నిరసనకారులతో సమావేశమయ్యారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి వారి ఆలోచనలను తాను వింటానని చెప్పారు. దశాబ్దాలుగా దేశంలోని అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితికి బాధ్యత వహిస్తూ ప్రధాని సోదరుడు, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఐదవ రోజు కూడా నిరనసలు చేపట్టారు. అవినీతి, దుష్పరిపాలనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన కుటుంబం కూడా అధికారాన్ని వీడాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరసనకారుల ప్రతినిధులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడిన కొంతమంది నిరసనకారులు ప్రధాని ప్రతిపాదనను తిరస్కరించారు. అనుభవజ్ఢుడైన రాజకీయ నేతగా చర్చలకు పిలవడం కంటే రాజీనామా చేయడమే మంచిదని వారు చెప్తున్నారు.
కొన్ని నెలలుగా శ్రీలంక వాసులు ఇంధనం, ఆహార కొరత, రోజువారీ విద్యుత్తు అంతరాయాలను భరించారు. ఆ వస్తువులలో చాలా వరకు కరెన్సీలో చెల్లించాల్సి ఉంది. అయితే శ్రీలంక దివాలా అంచున ఉంది. క్షీణిస్తున్న విదేశీ నిల్వలతో రాబోయే ఐదేళ్లలో తిరిగి చెల్లించాల్సిన $25 బిలియన్ల విదేశీ రుణం ఉంది.ఈ ఏడాది దాదాపు 7 బిలియన్ డాలర్లు రావాల్సి ఉంది.