Sri Lanka Emergency : శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటన- చేతులెత్తేసిన రణిల్ విక్రమసింఘే
శ్రీలంకలో పరిస్ధితులు మరింతగా దిగజారాయి. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశం విడిచి పరారవడంతో ఆయన స్ధానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే.. పరిస్ధితుల్ని అదుబులోకి తెచ్చేందుకు కొన్నిరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన ఎమర్జెన్సీ ప్రకటించారు.
శ్రీలంకలో అత్యవసర పరిస్ధితి ప్రకటిస్తున్నట్లు తాత్కాలిక అధ్యక్షుడుప రణిల్ విక్రమసింఘే ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనల్ని అడ్డుకునేందుకు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చారు. అయినా పరిస్దితులు అదుపులోకి రావడం లేదు. దీంతో అత్యవసర పరిస్ధితి విధించడం మినహా మరో మార్గం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైన్యం సలహాతో ఎమర్జెన్సీ విధించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న గోటబాయ రాజపక్స రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం కావడం, అధ్యక్ష భవనంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లడంతో చేసేది లేక ఆయన ప్రాణం కాపాడుకుని మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి గోటబాయ స్పీకర్ కు రాజీనామా కూడా పంపారు. దీంతో స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని విక్రమసింఘేను నియమించారు. కానీ ఆయన కూడా పరిస్దితుల్ని అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్దితులపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఆయన్నుకూడా వదిలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీతో పరిస్ధితుల్ని అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.