అంధకారంలో శ్రీలంక - ఆస్పత్రుల్లో హాహాకారాలు - నాలుగేళ్లలో రెండోసారి విద్యుత్ బ్రేక్ డౌన్
ద్వీపదేశం శ్రీలంక సోమవారం అంధకారంలో చిక్కుకుపోయింది. ప్రధాన విద్యుత్ సరఫరా కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశమంతటా పవర్ బ్రేక్ డౌన్ అయింది. మధ్యాహ్నం నుంచి కరెంటు లేకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడింది.
రాజధాని కొలంబోకు సమీపంలోని కెరవలపిటియ పవర్ స్టేషన్లో తలెత్తిన సమస్యలే అంధకారానికి కారణమని ఆ దేశ విద్యుత్ శాఖ మంత్రి అలహపెరుమ మీడియాకు తెలిపారు. బ్రేక్ డౌన్ కు దారితీసిన కారణాలపై విచారణ చేయిస్తామన్నారు. శ్రీలంకకు అవసరమైన కరెంటులో మెజార్టీ శాతం చమురు ఆధారిత థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రమైన కెరవలపిటియా నుంచే సరఫరా అవుతుంది.

దాదాపు ఎనిమిది గంటల తర్వాతగానీ కొలంబోలోని కీలక ప్రాంతాలు, దేశంలోని ఇతర పట్టణాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే ఇప్పటికీ చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఇరుకైన కొలంబో రోడ్లపై ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ట్రాఫిక్ లైట్లు లేకపోవడంతో పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడానికి అష్టకష్టాలు పడ్డారు.
చివరిసారిగా 2016 మార్చిలో శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ బ్రేక్ డౌన్ అయింది. నాటి ఘటనతో యంత్రాంగం పాఠాలు నేర్వకపోవడం వల్లే మళ్లీ దేశం అంధకారంలో చిక్కుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఆస్పత్రులతోపాటు బ్యాంకులు, ఏటీఎంలు, మంచినీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు.












Click it and Unblock the Notifications