పార్లమెంటులో రచ్చ రచ్చ: కారంపొడి చల్లుకొని, కుర్చీలు విసురుకున్న ఎంపీలు
కొలంబో: శ్రీలంక పార్లమెంటులో శుక్రవారం షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఎంపీలు ఒకరిపై మరొకరు కారంపొడి చల్లుకున్నారు. ఒకరి మీద మరొకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో అంతా గందరగోళం చెలరేగింది. చట్టాలు చేయాల్సిన పార్లమెంటులో ఎంపీలు ముష్టిఘాతాలకు దిగడం గమనార్హం.
రాజపక్సే ఇటీవల బలపరీక్షలో ఓటమి పాలయ్యారు. శుక్రవారం రెండోసారి బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు సభాపతికి నోటీసులు ఇచ్చారు. అందుకు ఆయన ససేమీరా అన్నారు. ఆయన అంగీకరించకపోవడంతో పార్లమెంట్లో రణరంగాన్ని తలపించింది. పలువురు ఎంపీలుప్రతిపక్ష ఎంపీలపై కారంపొడి చల్లారు.

స్పీకర్ జయసూర్యపై పుస్తకాలు, వాటర్ బాటిల్స్ విసిరారు. ఆయనపై దాడి చేశారు. పోలీసులు ఈ దాడిని అడ్డుకున్నారు. అయితే పోలీసులపై కూడా వారు కుర్చీలు విసిరారు. రణరంగాన్ని తలపించేలా కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. స్పీకర్ కుర్చీని పోడియం నుంచి ఫ్లోర్ మీదకు లాక్కొచ్చారు. దీనిని ప్రధాని సీట్లో కూర్చొని చూశారు.

అంతకుముందు, పార్లమెంటు సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. కత్తులతో వచ్చిన విక్రమ్ సింఘే పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను వెంటనే అరెస్టు చేయాలని రాజపక్సెకు మద్దతుగా ఉన్న ఎంపీలు డిమాండ్ చేశారు. అప్పటి నుంచి గొడవ మొదలైంది. రాజపక్సె మద్దతుదారులు స్పీకర్ జయసూర్యపైకి పలు వస్తువులను విసిరేశారు. ఎంపీలు ఒకరిపై మరొకరు కారప్పొడి చల్లుకుంటూ దాడులకు దిగారు. సభ రణరంగాన్ని తలపించడంతో 19వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications