శ్రీలంక: ఆహార కొరత, విద్యుత్ కోతలతో చిర్రెత్తిపోయిన ప్రజలు... అధ్యక్ష భవనంపై దాడి, హింసాత్మకంగా మారిన ఆందోళన
శ్రీలంక అధ్యక్ష భవనం బయట ప్రజల నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. టియర్ గ్యాస్ను ప్రయోగించారు.
ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
బారికేడ్లను తోసుకుంటూ వచ్చిన ఆందోళనకారుల సమూహం, గురువారం రాత్రి ఒక బస్సును తగులబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.
అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఈ సంఘటనలను ''ఉగ్రవాద చర్యలు'' అని నిందించారు.
శ్రీలంకలో విదేశీ మారక సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.
అక్కడి ప్రజలు ఏకబిగిన 13 గంటల పాటు విద్యుత్ కోతను ఎదుర్కొన్నారు. చమురు, కనీస అవసరాలైన ఆహారం, మందులు కొరత కారణంగా ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తారా స్థాయికి చేరింది.
అధ్యక్ష భవనం ఎదుట నిరసన కార్యక్రమాలు శాంతియుతంగానే మొదలయ్యాయి. కానీ, పోలీసులు వాటర్ కేనన్స్, టియర్ గ్యాస్ను ప్రయోగించడంతో పాటు అక్కడున్న వారిని కొట్టారని నిరసనల్లో పాల్గొన్న వారు చెప్పారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం రాజపక్స పాపులారిటీలో వచ్చిన మార్పుకు ఈ నిదర్శనలు సంకేతం. దేశ పాలనలో స్థిరత్వం తెస్తానంటూ వాగ్దానాలు చేసిన రాజపక్స 2019లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు.
- శ్రీలంకలో బంగాళాదుంప కిలో రూ. 200 ఎందుకు... దేశం దివాలా తీయడం అంటే ఏంటి, భారత్కు కూడా ఆ పరిస్థితి వచ్చిందా?
- చైనా అప్పుల ఉచ్చులో పేద దేశాలు చిక్కుకుపోతున్నాయా
శ్రీలంక ప్రస్తుత గడ్డు పరిస్థితికి ప్రధానమైన కారణాల్లో ఒకటిగా ప్రభుత్వంలోని అవినీతి, బంధుప్రీతిని విమర్శకులు ఎత్తి చూపిస్తున్నారు. రాజపక్స మంత్రివర్గంలోని అనేక కీలక శాఖలు ఆయన సోదరులు, మేనల్లుడు వద్ద ఉన్నాయి.
అధ్యక్షునితో పాటు మంత్రులు విద్యుత్ కోతల నుంచి తప్పించుకోవడం, ఆయన కుటుంబ సభ్యులు సంపదను ప్రదర్శించుకోవడం మూలంగానే ప్రజల్లో కోపం పెరిగిపోయిందని వార్తా నివేదికలు తెలుపుతున్నాయి.
పర్యటక రంగంపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావమే ప్రస్తుత సంక్షోభానికి కారణమంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 2019లో ఈస్టర్ సండే సందర్భంగా చర్చిలపై వరుస దాడులతో విదేశీ పర్యటకుల రాక బాగా తగ్గిపోయిందని పేర్కొంటోంది. ద్వీప దేశమైన శ్రీలంకలో విదేశీ ఆదాయానికి ప్రధాన వనరు పర్యటకమే.
అయితే, ఈ సంక్షోభం ఏర్పడి చాలా కాలం అయిందని నిపుణులు అంటున్నారు.
''గత 20 ఏళ్లలో జరిగిన పర్యవసానాల ఫలితమే ఈ తాజా సంక్షోభం. అయితే, ఎప్పటిలాగే దీనికి బాధ్యత వహించేవారే లేరు. వాస్తవానికి 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంక్షోభాన్ని ఉద్దేశపూర్వకంగానే అలక్ష్యం చేసిన ప్రస్తుత ప్రభుతమే దీనికి నేరుగా బాధ్యత వహించాలి'' అని బీబీసీతో రాజకీయ శాస్త్రవేత్త, వ్యాఖ్యాత జయదేవ ఉయాంగోడ అన్నారు.
శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ మాజీ గవర్నర్ డబ్ల్యూఏ విజేవర్ధన ప్రస్తుత పరిస్థితి గురించి బీబీసీతో మాట్లాడారు.
''2009లో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత గ్లోబల్ ఎకానమీతో కలవకుండా శ్రీలంక పొరపాటు చేసింది. అప్పుడు శ్రీలంక ఎకానమీ దాదాపు 9 శాతం వృద్ధిని నమోదు చేసింది.''
''2000 ఏడాదిలో జీడీపీలో 33 శాతంగా ఉన్న ఎగుమతులు, ప్రస్తుతం 12 శాతానికి పడిపోయాయి. అదే స్థాయిలో కొనసాగుతున్నాయి'' అని ఆయన చెప్పారు.
శ్రీలంక రూపాయి విలువ తగ్గించడానికి ప్రభుత్వం నిరాకరించడం కూడా దేశంలో విదేశీ నిల్వలు తగ్గడానికి కారణమైంది.
2019 చివరి నాటికి 7.6 బిలియన్ డాలర్లు (రూ. 57,787 కోట్లు)గా ఉన్న శ్రీలంక విదేశీ నిల్వలు ఇప్పుడు 2.3 బిలియన్ డాలర్ల (రూ. 17,488 కోట్లు)కు పడిపోయాయి. వీటిలో వినియోగానికి అవసరమయ్యేవి 300 మిలియన్ డాలర్ల (రూ. 2,281 కోట్లు)కు పడిపోయాయి.
పరిస్థితులు కుదుటపడే కంటే ముందు మరింత దుర్భరంగా మారతాయని విజేవర్ధన భావిస్తున్నారు. అత్యధికంగా దిగుమతులపై ఆధారపడే దేశమైన శ్రీలంకలో స్థిరమైన విదేశీ మారక ప్రవాహం లేనందున పరిస్థితులు దిగజారతాయని ఆయన వివరించారు.
అత్యవసర వస్తువులైన చమురు, విద్యుత్ వంటి వాటిని కొనడానికి కూడా శ్రీలంక వద్ద సరిపడినన్ని డాలర్లు లేవు.
- కోవిడ్కు విరుగుడు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్ కరోనాతో మృతి
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్ప్రెస్ పెర్ల్
దీని ఫలితంగానే దేశంలోని విద్యుత్ బోర్డులు కోతలు విధిస్తున్నాయి. రాన్రాను ఈ కోతల సమయం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే గురువారం అక్కడ 13 గంటల పాటు విద్యుత్ కోతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఇది 16 గంటలకు పెరిగే అవకాశం ఉంది.
విద్యుత్ కోతల కారణంగా లక్షలాది మంది ప్రజల దైనందిన వ్యవహారాలు, వ్యాపారాలు, చదువు ప్రభావితం అయ్యాయి.
పెట్రోల్ బంకుల బయట, వంటగ్యాసు సిలిండర్ల కోసం గంటల పాటు ఎండలో ప్రజలు క్యూలల్లో బారులు తీరుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
గత కొన్ని వారాల్లో క్యూలోనే కుప్పకూలిపోయి పెద్ద వయస్కులైన అయిదుగురు వ్యక్తులు మరణించారు.
దేశ వ్యాప్తంగా ఆహార పదార్థాల కొరత, అత్యవసర మందుల కొరత ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్: భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు ఈ ఆర్థికవేత్త ఆలోచనలే బాటలు వేశాయని మీకు తెలుసా?
- భారత్-పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్కు అవసరమా, అనవసరమా?
- ఏపీ: రేపటి నుంచి మీ కరెంట్ బిల్లు ఎంత పెరగొచ్చంటే..
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- 'ఇక విశాఖలో వ్యాపారం చేయను.. హైదరాబాద్లోనే చేసుకుంటా’నని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)