శ్రీలంక: మరణశిక్ష పడిన తమిళ జాలర్ల విడుదల
న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఐదుగురు తమిళనాడు జాలర్లను శ్రీలంక విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే రద్దు చేశారని సమాచారం. కొలంబోలోని భారత అధికారులకు ఆ ఐదుగురిని అప్పగించారు. భారత్ నుంచి శ్రీలంకకు మాదక ద్రవ్యాలను స్మిగ్లింగ్ చేశారనే ఆరోపణపై వారికి కొలంబో హైకోర్టు అక్టోబర్ 30వ తేదీన మరణశిక్ష విధించింది.
వారికి విధించిన మరణశిక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారికి క్షమాభిక్ష ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే చెప్పారు. ఐదుగురు జాలర్లకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు వచ్చిన ప్రకటన హృదయానికి ఊరట నిచ్చిందని, కేంద్ర ప్రభుత్వ కృషి వల్లనే అది సాధ్యమైందని బిజెపి నాయకుడు జివిఎల్ నరసింహ అన్నారు.
జాలర్ల విడుదల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషిని తాము ఇది వరకే కొనియాడామని డిఎంకె నేత టికెఎస్ ఇలాంగోవన్ చెప్పారు. తమిళనాడుకు చెందిన పి. ఎమర్సన్, పి. ఆగస్టస్, ఆర్ విల్సన్, కె. ప్రశాంత్, జె లాంక్లెట్ అనే ఐదుగురు జాలర్లకు కొలంబో హైకోర్టు మరణశిక్ష విధించింది. హెరాయిన్ ట్రాఫికింక్ ఆరోపణపై శ్రీలంక నావికా దళం వారిని 2011లో అరెస్టు చేసింది.
ఆగ్రహించిన తమిళనాడు
మాదకద్రవ్యాల స్మగ్లింగ్లో రామనాథపురానికి చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించడంతో ఆగ్రహించిన ప్రజలు తమిళనాడులో విధ్వంసానికి దిగిన విషయం తెలిసిందే. రామేశ్వరం, పంబన్ మధ్య 900 మీటర్ల మేర రైల్వే ట్రాక్ను తొలగించారు. రైల్వే ట్రాక్ను తొలగించడంతో మూడు రైళ్లు కూడా రామేశ్వరంలో ఆగిపోయాయి. ఆగ్రహించిన ప్రజలు ఓ బస్సుకు కూడా నిప్పు పెట్టారు.