మైనార్టీలో శ్రీలంక సర్కార్-41 మంది రాజీనామాలు-సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణ
ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ద్వీప దేశం శ్రీలంక కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పటికే ఎమర్జెన్సీతో పాటు ప్రజా నిరసనలతో ఓవైపు ఉక్కిరిబిక్కిరవుతున్న అధికార సంకీర్ణ ప్రభుత్వానికి ఎంపీలతో పాటు మిత్రపక్షాలు కూడా వరుస షాకులిస్తున్నాయి. వరుస రాజీనామాలతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.
ఎస్ఎల్పీపీ నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం నుంచి ఇప్పటికే 41 మంది ఎంపీలు వైదొలిగారు. 11 మంది ఎంపీలతో కలిసి తాము ప్రత్యేక స్వతంత్ర గ్రూపుగా ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంటు సభ్యుడు అనురా ప్రియదర్శన యాపా శ్రీలంక పార్లమెంటుకు తెలిపారు. మాజీ మంత్రి విమల్ వీరవాన్స కూడా అదే బాట పట్టారు. తాను 16 మంది ఎంపీలతో ప్రత్యేక స్వతంత్ర గ్రూపుగా ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంటుకు తెలియజేశారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, 15 మంది ఎస్ఎల్ఎఫ్పి ఎంపీలతో కలిసి తాము ప్రత్యేక స్వతంత్ర గ్రూపుగా ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంటుకు తెలియజేశారు. సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని పార్టీ నిర్ణయించినట్లు సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ (సిడబ్ల్యుసి) అధ్యక్షుడు సెంథిల్ తొండమాన్ తెలిపారు. సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని అధ్యక్షుడు గోటబాయ రాజపక్సకు తెలియజేసినట్లు తొండమాన్ కొలంబో గెజిట్కి తెలిపారు.
మరోవైపు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపిటియ కూడా రాజీనామా చేశారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపిటియా తన పదవికి రాజీనామా చేసినట్లు కొలంబో గెజిట్ వెల్లడించింది. తన రాజీనామా విషయాన్ని అధ్యక్షుడు గోటబాయ రాజపక్సేకు తెలియజేశారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (SLFP) ప్రభుత్వం నుండి వైదొలిగి పార్లమెంటులో స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ఆయన రాజీనామా చేశారు. 24 గంటల్లోనే ఆర్థిక మంత్రి పదవికి అలీ సబ్రీ కూడా రాజీనామా చేశారు. అలీ సబ్రీ ఏప్రిల్ 4న శ్రీలంక ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ఆయన బసిల్ రాజపక్సే స్థానంలో బాధ్యతలు చేపట్టారు.