శ్రీదేవి హోటల్ గది సీజ్.. మృతిపై భిన్నకథనాలు, మేనల్లుడు ఏమన్నాడంటే.., మండిపడ్డ రిషికపూర్!
Recommended Video

దుబాయ్: నటి శ్రీదేవి మృతదేహం అప్పగింత విషయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ ఆమె మృతిపై భిన్నకథనాలు వెలువడుతున్నాయి. అసలు శ్రీదేవి గుండెపోటు కారణంగానే మరణించారా? లేక ఆమె మరణానికి ఇంకేదైనా కారణముందా? అనే కోణంలో కొత్తకొత్త కథనాలు పుట్టుకొస్తూ కలకలం రేపుతున్నాయి.
శ్రీదేవి మృతిపై ఆమె మేనల్లుడు మోహిత్ మర్వా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన వివాహ వేడుకకు వచ్చి ఆమె మరణించడంపై ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు కూడా పెట్టాడు. మరోవైపు శ్రీదేవి మరణంపై వివిధ కథనాలు ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్లపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ కూడా మండిపడ్డారు.

శ్రీదేవి బస చేసిన సూట్ సీజ్...
మరోవైపు దుబాయ్లో శ్రీదేవి బస చేసిన హోటల్ జుమేరా ఎమిరేట్స్ టవర్లోని గదిని దుబాయ్ పోలీసులు సీజ్ చేశారని, ఆ సూట్ మొత్తాన్ని ‘క్రూషియల్ స్పాట్'గా గుర్తించారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే సాధారణ విచారణ ప్రక్రియలో భాగంగానే ఆ హోటల్ సూట్ను సీజ్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

మరణంపై విభిన్న కథనాలు...
శ్రీదేవి భౌతికకాయం దుబాయ్ నుంచి ముంబై చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై విభిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గుండెపోటుతో కాదని, బాత్టబ్లో ఊపిరాడక శ్రీదేవి మరణించిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె మరణించిన సమయంలో ఆమె భర్త అసలు దుబాయ్లో లేరని కూడా అంటున్నారు.

కఠిన నిబంధనలవల్లే తరలింపులో జాప్యం...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు శ్రీదేవి గుండెపోటు వల్లే మరణించినట్లు దుబాయ్ వైద్యులు ధృవీకరించారు. సోమవారం సాయంత్రానికి శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరనున్నట్లు తెలుస్తోంది. రీపోస్టుమార్టం అవసరం లేదని, ఆమె మృతదేహం తరలింపులో తీవ్ర జాప్యానికి కారణం దుబాయ్ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కఠిన నియమ నిబంధనలేనని తెలుస్తోంది.

ముంబైలో అంతిమయాత్రకు ఏర్పాట్లు పూర్తి...
మధ్యాహ్నం రెండు గంటల కల్లా(స్థానిక కాలమానం ప్రకారం) శ్రీదేవి పార్థివదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని ఇండియన్ ఎంబసీ అధికారులు పేర్కొన్నట్లు ‘ఖలీజ్ టైమ్స్' తెలిపింది. మరోవైపు శ్రీదేవి అంతిమయాత్ర కోసం ఇటు ముంబైలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

శ్రీదేవి ‘లెజెండ్’కంటే ఎక్కవు...
ప్రఖ్యాత నటి, అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగా, ఆమె కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. మేనల్లుడు మోహిత్ మర్వా వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వచ్చిన శ్రీదేవి.. వేడుకలు కొనసాగుతున్న తరుణంలోనే ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతిపై తాజాగా శ్రీదేవి మేనల్లుడు మోహిత్ మర్వా కూడా స్పందించాడు. తన పెళ్లికి హాజరైన ఆమె అర్ధంతరంగా తనువు చాలించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రీదేవి లెజెండ్ కన్నా ఎక్కువే. ఆమె లేని లోటు ఎప్పటికీ తీరదు..' అంటూ ఇన్స్టాగ్రామ్లో మోహిత్ ఆవేదనగా ఒక పోస్టు పెట్టాడు.

మీడియాపై మండిపడిన రిషికపూర్...
దుబాయ్లో మరణించిన శ్రీదేవి భౌతికకాయం తరలింపుపై మీడియాలో వస్తున్న కథనాల పట్ల బాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పుడు ఆమెతో కలిసి సినిమాల్లో నటించిన అలనాటి హీరో రిషికపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మరణంపై వివిధ కథనాలు ప్రసారం చేస్తున్న చానెళ్లపై ఆయన మండిపడ్డారు. ఆమెను ‘మృతదేహం'గా పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. శ్రీదేవి అకస్మాత్తుగా బాడీ (మృతదేహం)గా ‘ఎలా మారిపోయింది. టీవీ చానెళ్లు ‘ఆమె బాడీని ముంబైకి తీసుకువస్తారంటూ' కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఉన్నఫళంగా శ్రీదేవి వ్యక్తిత్వం మాయమైపోయి.. ఆమె బాడీగా మారిపోయిందా?' అని రిషీ కపూర్ ఆగ్రహంగా ట్వీట్ చేశారు. అంతేకాదు, ‘ఇక చందమామ రాత్రులు ఉండవు. చాందినీ శాశ్వతంగా వెళ్లిపోయింది. అలాస్' అంటూ రిషి కపూర్ ఆదివారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications