అమెరికాను వణికిస్తున్న ‘మంచు తుపాను’.. రెండు రాష్ట్రాల్లో ‘ఎమర్జెన్సీ’
అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతోంది. మంచు తుఫాన్ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది బిక్కుబిక్కుమంటున్నారు.
వాషింగ్టన్: అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతోంది. మంచు తుఫాన్ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే 7600 విమానాలు రద్దయ్యాయి. వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది.
ఇప్పటికే అధికారులు పలు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో కాలులు వీస్తాయని, అత్యవసరమైతేనే మయటికి రావాలని సూచించారు. అమెరికాలోని ప్రతి ముగ్గురు పౌరుల్లో ఒకరు ఈ మంచు తుపాన్ కారణంగా ప్రభావితమవుతున్నట్లు సీఎన్ఎన్ చానెల్ వెల్లడించింది.
ఆ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ...
ఫిలడెల్ఫియాలో సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఎమర్జెన్సీని విధించారు. మంచు తుపాన్ బారినపడి ఇప్పటికే విస్కాన్సిస్ లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ విధించారు. వాహనాలు మంచులో కూరుకుపోయాయి.
రెండడుగుల ఎత్తున...
న్యూయార్క్, బోస్టన్ లాంటి ప్రధాన నగరాలను మంచు దుప్పటి కప్పేస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు అడుగుల ఎత్తున భారీగా మంచు కురిసే అవకాశమున్నట్లు మంగళవారం వాతావరణ నివేదిక స్పష్టం చేస్తోంది.
విమానాల రద్దు...
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మంచు తుపాన్ ప్రభావం అధికంగా కనిపించింది. ఈ ప్రాంతంలోని అన్ని విమానాలను మూడు రోజులపాటు రద్దు చేశారు. న్యూయార్క్ నగరంలో 20 అంగుళాల మేర మంచు కురవనున్నట్లు అంచనా వేస్తున్నారు.
భారీగా బలగాలు...
న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో అత్యవసర చర్యలకు ఆదేశించారు. ఇప్పటికే నగరంలో భారీగా బలగాలను మోహరించారు. ఫిలడెల్ఫియాలో 10 అంగుళాలు, మసాచుసెట్స్ లో 24 అంగుళాల మేర మంచు కురుస్తోంది.
ఎక్కడికక్కడ బంద్...
మంగళవారం ఉదయం నుంచి కనెక్టికట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధం విధించారు. అటు వర్జీనియాలో పోర్ట్ ఆఫ్ వర్జీనియాను కోస్ట్ గార్డ్ మూసివేసింది. తూర్పు తీరంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
ప్రజలెవరూ బయటికి రాకూడదు...
ఎమర్జెన్సీ విధించిన నగరాల్లోని ప్రజలెవరూ ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇ్లలో నుంచి బయటికి రారాదని అధికారులు హెచ్చరించారు. మంగళవారం నుంచి స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు కూడా ఉద్యోగులకు సెలవులు ప్రకటించాలని సూచించారు.