లాహోర్లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి, పక్కనే కాలేజీలు
లాహోర్: పాకిస్తాన్లో మంగళవారం మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. లాహోర్లోని పోలీస్ లైన్ సమీపంలో ఆత్మాహుతి దాడికి దిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. వారిలో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు.
ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతంలో రద్దీ ప్రాంతం. అక్కడ పాకిస్తాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ ఆఫీస్ (రేడియో), బీబీ పాక్ దమన్తో పాటు పలు పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి.
కాగా, పాకిస్తాన్లో మూడు రోజుల క్రితం కూడా పెషావర్లో సైన్యం, తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. గత శుక్రవారం పాకిస్తాన్లో బాంబు పేలింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా దాదాపు యాభై మందికి పైగా గాయపడ్డారు.
శుక్రవారం ఉదయం పెషావర్లోని హయతాబాదు ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇందులో ఓ పేలుడు సమీపంలోని మసీదు బయట చోటు చేుకుంది. స్థానిక డాన్ న్యూస్ పేపర్ కథనం ప్రకారం... ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మూడు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాదు, కాల్పులు కూడా జరిగాయి.