బుర్ర పని చేయట్లేదు: సునంద పుష్కర్పై పాక్ జర్నలిస్ట్
భర్తను భ్రష్టు పట్టించిన భార్య... ఇప్పుడు సమస్యను సర్దుబాటు చేయాలని చూస్తున్నారని మెహర్ ట్వీట్ చేశారు. (మొదట ఆరోపణలు చేసిన సునంద ఆ తర్వాత భర్త థరూర్తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు.) సునంద తీరు చూస్తుంటే ఆమె బుర్ర పని చేస్తున్నట్లు లేదని, ఒక మహిళ మరో మహిళకు తన భర్తతో సంబంధం అంటగట్టడం అత్యంత నీచమైనదని, దీనికంటే మరో నీచం ఉండదని, ఆమెకు వివాహా బంధంపై గౌరవం లేనట్లుగా కనిపిస్తోందని తూర్పారబట్టారు.
తాను శశి థరూర్ వెంట పడుతున్నానని, ఐఎస్ఐ ఏజెంట్నను చెబుతోందంటే ఆమె ఏమిటో తెలుస్తోందన్నారు. ఫోన్లలో వెంట పడుతున్నానన్న సునంద పైన తాను పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను ఐఎస్ఐ లేదా రా లేదా సిఐఏ లేదా మొసాద్ ఏజెంట్ను కాదన్నారు.
మరోవైపు తన అనుమతి లేకుండా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి సునందా పుష్కర్ సందేశాలు పంపించడం కొంత మనస్థాపాన్ని కలిగించిందని, అయినప్పటికీ తాము సంతోషంగా ఉన్నామని శశి థరూర్ పేర్కొన్నారు. సునంద ఈ వారం అనారోగ్యానికి గురయి ఆసుపత్రిలో చేరారని, ఆమెకు విశ్రాంతి అవసరమని తెలుపుతూ మీడియా తమ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించకుండా ఉంటే కృతజ్ఞత తెలియజేస్తామని థరూర్ పేర్కొన్నారు.